22-06-2025 12:00:00 AM
ప్రజారవాణా వ్యవస్థలో దేశంలోనే తొలి మహిళ
- పదేళ్లపాటు ‘ఢిల్లీ ట్రాన్స్పోర్ట్’లో విధులు
- తల్లిదండ్రుల అనారోగ్యం కారణంగా స్వరాష్ట్రానికి..
- తెలంగాణ ఆర్టీసీలోనూ మొదటి మహిళగా రికార్డు
- ప్రైవేటు అద్దెబస్సు డ్రైవర్గా కొలువిచ్చిన ‘జేబీఎం’
సంస్థాన్ నారాయణపూర్, జూన్ ౨1 (విజయక్రాంతి): మహిళలు కేవలం కొన్ని రంగాలకు మాత్రమే పరిమితం కాకుండా పురుషులతో పాటు సమానంగా అని రంగాల్లో రాణిస్తున్నారనడానికి నిదర్శనం వాంకుడోత్ సరితా నాయక్. తెలంగాణ ఆర్టీసీ పరిధిలో మొదటి మహిళా డ్రైవర్గా ఆమె చరిత్ర సృష్టించింది.
సరిత స్వస్థలం యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం సీత్యా తండా. తల్లిదండ్రులు వాంకుడోత్ రాంకోటి, రుక్క. వీరికి ఆరుగురు సంతానం కాగా ఐదో సంతానం సరిత. తనకంటే పెద్దవారైనా నలుగురు అక్కల పెళ్లిళ్ల కోసం తల్లిదండ్రులు మూడెకరాల భూమిని అమ్మేశారు. దీంతో కుటుంబ పోషణ కష్టంగా మారింది. వీటన్నింటినీ గమనించిన సరిత పదో తరగతి చదువును మధ్యలోనే ఆపేసి కూలి పనులకు వెళ్లడం ప్రారంభించింది. కుటుంబ బాధ్యతలను భుజాన వేసుకున్నది.
ఈ క్రమంలో దేవరకొండలో ఉంటున్న తన పెద్దక్క నివాసానికి వెళ్లింది. అక్కడికి వెళ్లిన కొద్ది రోజులకే బావ మరణించాడు. దీంతో అక్క బాధ్యత కూడా తన భుజాల పైనే పడింది. అప్పటికే బావకు ఆటో ఉండటంతో ఆమెకు దాన్ని నడిపి కుటుంబాన్ని పోషించవచ్చు కదా.. అనే ఆలోచన వచ్చింది. అనుకున్నదే తడువుగా ఆటో నడపడం నేర్చుకున్నది. ఆకతాయిల అల్లరి తాకిడికి తాళలేక తన ఆహార్యాన్ని మార్చుకున్నది. అచ్చం పురుషుడిలా ప్యాంట్, షర్ట్ ధరించడం ప్రారంభించింది. జుత్తు కత్తిరించుకొని పిల్లాడిలా రూపం మార్చుకున్నది.
ఉద్యోగ ప్రయాణం..
ఆటో నడుపుతున్నప్పటికీ, ఆర్జించిన సొమ్ము కుటుంబ ఖర్చులకు సరిపోలేదు. దీంతో సరిత కొత్తదారులు వెతుక్కుంటూ హైదరాబాద్కు చేరింది. అక్కడ హాస్టల్లో ఆశ్రయం పొంది హెవీ మోటార్ డ్రైవింగ్ నేర్చుకున్నది. ఈ క్రమంలో ప్రైవేట్ కాలేజీలో బస్సు డ్రైవర్గా ఉపాధి సంపాదించుకున్నది. 2010లో నల్లగొండ ఆర్టీసీ డిపోలో డ్రైవర్ పోస్టుకు దరఖాస్తు చేసుకున్నది. కానీ, ఆమె పోస్టుకు ఎంపిక కాలేదు. అయినప్పటికీ తన ఆత్మస్థైర్యాన్ని కోల్పోకుండా ప్రయత్నాలు కొనసాగించింది.
ఢిల్లీ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్లో మహిళలకు డ్రైవర్ ఉద్యోగాలు ఉన్నాయని తెలుసుకొని, దరఖాస్తు చేసుకుంది. అలా 2014లో అక్కడ కొలువు సాధించి, ప్రజారవాణా వ్యవస్థలో డ్రైవర్ పోస్టు సాధించిన దేశంలో మొదటి మహిళగా ఆమె చరిత్ర సృష్టించింది. అక్కడ నిబద్ధతతో పనిచేస్తూ అనేక సేవా పతకాలు సాధించింది. రివార్డులు దక్కించుకున్నది 2018లో నాటి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ చేతుల మీదుగా ప్రత్యేక పురస్కారాన్ని సైతం అందుకున్నది. అప్పటి నుంచి 2023 వరకు ఢిల్లీలో మరో మహిళెవరూ అక్కడ డ్రైవర్గా విధులు నిర్వర్తించలేదని సరిత తెలిపింది. ప్రస్తుతం అక్కడి ప్రజారవాణా వ్యవస్థలో 100 మంది మహిళా డ్రైవర్లు భాగస్వాములు అయ్యారని వెల్లడించింది.
ఢిల్లీ టూ తెలంగాణ..
రెండు మూడేళ్ల నుంచి సరిత తల్లిదండ్రుల వృద్ధాప్యం, అనారోగ్య సమస్యలతో సతమతమవుతున్నారు. దీంతో సరిత ఢిల్లీ కొలువు విడిచిపెట్టింది. ఈ మేరకు మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొన్నం ప్రభాకర్లను మర్యాద పూర్వకంగా కలిసి తన సమస్యను వివరించింది. వారు ఆర్టీసీ ఎండీ సజ్జనార్తో మాట్లాడి స్పెషల్ రిక్రూట్మెంట్ కింద తెలంగాణ ఆర్టీసీలో ప్రైవేటు కొలువుకు అవకాశం ఇచ్చారు.
ఎలక్ట్రిక్ బస్సులు నిర్వహిస్తున్న ‘జేబీఎం’ సంస్థ ద్వారా ఆమె రిక్రూట్మెంట్ పత్రాలు అందుకున్నారు. అలా సరిత జూన్ 14న తెలంగాణ ఆర్టీసీ సంస్థలో చేరారు. ప్రస్తుతం ఆమె హైదరాబాద్ మిర్యాలగూడ ఎలక్ట్రికల్ బస్సు డ్రైవర్గా పనిచేస్తున్నారు. మరోవైపు ఆమెకు ఆర్టీసీ యాజమాన్యమే డ్రైవర్గా ప్రభుత్వ కొలువు ఇచ్చి ఉంటే బాగుండేదని, తద్వారా సరితకు సముచిత గౌరవం ఇచ్చినట్టు ఉండేదని ఆర్టీసీ యూనియన్ సంఘాల నాయకులు అభిప్రాయపడుతున్నారు.