డిబిఎమ్ 6 కాల్వకు గండి
డిఈకి సర్పంచ్ ఫిర్యాదు
తగిన చర్యలు తీసుకోవాలని పాత్రికేయుల సమావేశంలో డిమాండ్
మానకొండూరు,(విజయక్రాంతి): కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం రంగపేట గ్రామ శివారులోని డిబిఎం 6. 3ఎల్ కాల్వకు గండి తీసి, వ్యవసాయ బావిలోనికి అక్రమంగా పైపులైను వేసిన వారిపై తక్షణం చట్టపరమైన చర్యలు తీసుకోవాలని రంగపేట గ్రామ సర్పంచ్ కొత్త రామ్ రెడ్డి డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఆస్తులను నష్టపరిచిన వారందరిపై చట్టరీత్యా తీసుకోవాలని డిబిఎం 6 డిఈ వెంకటరమణకు లిఖిత పూర్వక ఫిర్యాదు చేశారు.
ఈ విషయంపై ఆయన మీడియాతో బుధవారం మాట్లాడుతూ... గోపు శ్రీనివాసరెడ్డి, అతనికి సహకరించిన గుడాల శ్రీనివాస్, అనిరెడ్డి సమ్మిరెడ్డి, పెసర శ్రీనివాసులు జూన్ 10న రాత్రి సమయంలో కాల్వకు అక్రమంగా గండిపెట్టి వ్యవసాయ బావిలోనికి నీటి కోసం పైపు లైను వేసి కాల్వనీటిని మళ్లించారని వివరించారు. క్షేత్రస్థాయిలో పరిశీలించి, గండితో కాల్వను ధ్వంసం చేసిన వారిపై నష్టపరిహారం వసూలు చేసి, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సర్పంచ్ రాంరెడ్డి కోరారు. ఉపసర్పంచ్ వేల్పుల కొమురయ్య, మారెళ్ళ నాగిరెడ్డి, వావిలాల శ్రీనివాసరెడ్డి, సంపత్ రెడ్డి తదితరులు ఈ పాత్రికేయుల సమావేశంలో పాల్గొన్నారు.






