21-05-2025 08:57:30 PM
స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి..
హనుమకొండ (విజయక్రాంతి): గ్రేటర్ వరంగల్ 64వ డివిజన్ పరిధిలోని ఉనికిచర్ల గ్రామంలో 1 కోటి 05 లక్షల రూపాయలతో సిసి రోడ్లు, సైడ్ డ్రైన్లు, వరద కాలువల నిర్మాణానికి ఎమ్మెల్యే కడియం శ్రీహరి(MLA Kadiyam Srihari) శంకుస్థాపన చేశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... గతంలోనే ఉనికిచర్ల గ్రామ అభివృద్ధికి కూడా ద్వారా 3 కోట్ల రూపాయలు మంజూరు చేసినట్లు వెల్లడించారు. ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత స్వయంగా గ్రామానికి వచ్చి క్షేత్రస్థాయిలో గ్రామంలో పర్యటించి గ్రామ సమస్యలు తెలుసుకున్నానని, అందులో భాగంగానే నేడు 1 కోటి 5 లక్షల రూపాయలతో సిసి రోడ్లు, సైడ్ డ్రైన్లు, వరద కాలువల నిర్మాణానికి శంకుస్థాపన చేసుకున్నామని తెలిపారు.
ఈ పనులను జులై 15లోగ పూర్తి చేయాలని అధికారులను, కాంట్రాక్టర్లను ఆదేశించారు. జాతీయ రహదారి నుండి ఉనికిచర్ల వరకు నాలుగు లైన్ల రోడ్డుతో పాటు సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఏడాది లోగ ఈ రోడ్డు నిర్మాణం పూర్తి చేస్తానని హామీ ఇచ్చారు. అలాగే ఉనికిచర్ల నుండి రాపాకపల్లి రోడ్డుకు 41లక్షలు మంజూరు అయ్యాయని త్వరలోనే పనులు ప్రారంభం అవుతాయాని అన్నారు. గ్రామంలో స్మశాన వాటికకు ప్రహరీ గోడ, వ్యవసాయ భూములకు రోడ్డు ఏర్పాటు, కమ్యూనిటీ హల్ నిర్మాణానికి అతి త్వరలో మంజూరు ఇస్తానని హామీ ఇచ్చారు.
అలాగే మహిళా కమ్యూనిటీ భవనం కావాలని అడిగారు అది గ్రామస్తుల నిర్ణయం మేరకు నిర్మిస్తానని వెల్లడించారు. ఉనికిచర్ల గ్రామానికి 24ఇందిరమ్మ ఇల్లు మంజూరు అయ్యాయని, అతి త్వరలో మరో 24ఇల్లు మంజూరు ఇస్తానని హామీ ఇచ్చారు. రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి కోసం ముందుకు రావాలని, గ్రామస్తులందరూ కలిసి వస్తేనే గ్రామ అభివృద్ధి సాధ్యం అవుతుందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ ఆవాల రాధికా రెడ్డి, గ్రేటర్ వరంగల్ డిప్యుటీ కమిషనర్ రవీందర్, ఈఈ సంతోష్, స్థానిక నాయకులు, బల్దియా అధికారులు, కార్యకర్తలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.