04-02-2026 01:34:14 AM
మొయినాబాద్, ఫిబ్రవరి 3 (విజయ క్రాంతి): రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో మొయినాబాద్ మున్సిపాలిటీపై బీఆర్ఎస్ పార్టీ జెండాను ఎగరవేస్తామని ఆ పార్టీ రాష్ట్ర నాయకుడు కొంపల్లి అనంతరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. మంగళవారం మొయినాబాద్లోని బీఆర్ఎస్ పార్టీ మొయినాబాద్ మున్సిపల్ ఎన్నికల బరిలో నిలుస్తున్న 26 మంది బీఆర్ఎస్ అభ్యర్థులకు కొంపల్లి అనంతరెడ్డి అధికారికంగా బీ-ఫామ్లను అందజేశారు.
ఈ సందర్భంగా అభ్యర్థులకు శుభాకాంక్షలు తెలుపుతూ, గెలుపు లక్ష్యంగా ముందుకు సాగాలని సూచించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కార్యకర్తలకు మరియు నాయకులకు పలు కీలక సూచనలు చేశారు. పార్టీ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించడానికి ప్రతి కార్యకర్త, నాయకుడు సమిష్టిగా పనిచేయాలన్నారు.
గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను, పార్టీ విధానాలను ఇంటింటికీ తీసుకెళ్లాలని కోరారు. మొయినాబాద్ మున్సి పాలిటీపై గులాబీ జెండా రెపరెపలాడటమే లక్ష్యంగా పనిచేయలన్నారు. కార్యక్రమంలో కొత్త నరసింహారెడ్డి, మొయినాబాద్ మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు దారెడ్డి వెంకట్ రెడ్డి, పార్టీ సీనియర్ నాయకులు మరియు భారీ సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.