ఆరు గ్యారెంటీల కోసం మళ్ళీ ఉద్యమాలు చేయాలా..!
- రాష్టంలో ఉద్యోగులు సైతం రోడ్లపైకి వచ్చే పరిస్థితి.
- రైతులకు ఉచిత కరెంట్ ఊసే లేదు
- కరెంట్ కోతలతో ప్రజలు ఇబ్బందులు
- కల్వకుర్తి ప్రాజెక్టు కాలువలు జమ్ముతో పేరుకుపోయినా పట్టించుకోని అధికారులు
- జిల్లా ఉన్నతాధికారులు స్పందించాలి.. లేదంటే ఎమ్మెల్యే ఇంటిని ముట్టడిస్తాం
- మీడియా సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు నాగం శశిధర్రెడ్డి
నాగర్కర్నూల్ (విజయక్రాంతి): కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీల అమలు కోసం ప్రజలు, ఉద్యోగులు ఉద్యమాలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని బీఆర్ఎస్ నాయకులు నాగం శశిధర్రెడ్డి విమర్శించారు. శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఉద్యోగులు సైతం తమ సమస్యల పరిష్కారం కోసం రోడ్డెక్కుతున్నారని అన్నారు.
రైతులకు ఉచిత విద్యుత్ అందిస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం ప్రస్తుతం ఆ ఊసే ఎత్తడం లేదని ఆరోపించారు. కరెంట్ కోతలతో రైతులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. కల్వకుర్తి ప్రాజెక్టు కాలువలన్నీ జమ్ముతో పేరుకుపోయి నీటి సరఫరాకు ఆటంకాలు ఏర్పడుతున్నా పాలకులు పట్టించుకోవడం లేదన్నారు. జిల్లా ఉన్నతాధికారులు వెంటనే స్పందించి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కరించకపోతే ఎమ్మెల్యే ఇంటిని ముట్టడించి ఆందోళన చేపడతామని నాగం శశిధర్రెడ్డి హెచ్చరించారు.






