calender_icon.png 1 June, 2025 | 11:13 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పీసీసీ చీఫ్‌ చిల్లర వ్యాఖ్యలు చేస్తున్నారు.. హరీశ్‌రావు ఫైర్‌

31-05-2025 11:55:54 AM

మా పార్టీ నుంచి వెళ్లిన నాయకులను వ్యక్తిగతంగా కలవలేదు

హైదరాబాద్: టీపీసీసీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్(Bomma Mahesh Kumar Goud) చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి, సిద్దిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు(Thanneeru Harish Rao) మండిపడ్డారు. భారతీయ జనతా పార్టీ ఎంపీ ఈటల రాజేందర్ తో రహస్యంగా సమావేశమయ్యారన్న వ్యాఖ్యలను హరీశ్ రావు ఖండించారు. పీసీసీ అధ్యక్ష హోదాలో ఉండి చిల్లరవ్యాఖ్యలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సూటిగా ఎదుర్కునే ధైర్యం లేక దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. విలువలు విస్మరించి రేవంత్ రెడ్డి బాటలోనే నడుస్తున్నారని ఆరోపించారు.

బట్టకాల్చి మీద వేసినంత మాత్రాన అబద్ధాలు నిజం కావని సూచించారు. మా పార్టీ నుంచి వెళ్లిన నేతలను వ్యక్తిగతంగా ఎప్పుడు కలవలేదని హరీశ్ రావు వివరించారు. పెళ్లిలోనో,  చావులోనో కలిసిన సందర్భాలే తప్ప వ్యక్తిగతంగా కలవలేదని ఆయన వెల్లడించారు. విలువలతో కూడిన రాజకీయాలు చేస్తాను తప్ప, మీ లాగా చిల్లర రాజకీయాలు చేసి లబ్ధి పొందాలని చూడనని హరీశ్ రావు చురకలంటించారు. ఇలాంటి ఆరోపణలు మానుకొని, స్థాయికి తగ్గట్లు వ్యవహరించాలని హెచ్చరించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీలు, 420 హామీలు అమలు పై దృష్టి పెట్టాలని మహేష్ కుమార్ గౌడ్ కు సూచిస్తున్నామని హరీశ్ రావు డిమాండ్ చేశారు. కాళేశ్వరం వివాదంపై నోటీసులు జారీ చేసిన తర్వాత బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ ఇటీవల బీఆర్ఎస్ నాయకుడు హరీష్ రావును ఫామ్‌హౌస్‌లో కలిశారని, ఇది వారి గత అనుబంధాన్ని తిరిగి పుంజుకుంటుందని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (Telangana Pradesh Congress Committee) అధ్యక్షుడు, ఎంఎల్‌సి మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు.

బిజెపి నాయకుల మౌనాన్ని ప్రశ్నిస్తూ, రాజా సింగ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందించాలని సవాలు విసిరారు. “రాజా సింగ్ ప్రకటనలపై మాట్లాడే ధైర్యం కిషన్ రెడ్డికి ఉందా?” అని ఆయన మహేశ్ కుమార్ ప్రశ్నించారు. బీఆర్ఎస్ పార్టీని "మునిగిపోతున్న ఓడ"గా కూడా ఆయన అభివర్ణించారు. బీఆర్ఎస్ నియంత్రణపై కేసీఆర్ కుటుంబంలో తీవ్రమైన అంతర్గత అధికార పోరాటం చెలరేగిందని ఆరోపించారు. “కేసీఆర్ కుటుంబంలో డబ్బు, అధికారం కోసం పోరాటం ప్రారంభమైంది” అన్నారు. కవిత లేఖను కేసీఆర్ సొంత కుటుంబ సభ్యులే ‘లీక్’  చేసి ఉండవచ్చని సూచించారు. కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీపై బీజేపీ చేసిన దాడులను ఖండించిన మహేష్ కుమార్ గౌడ్ బీజేపీ నిరంతరం విమర్శలు వారి తక్కువ స్థాయి రాజకీయాలను ప్రతిబింబిస్తాయని ఆరోపించారు.