30-05-2025 02:25:00 PM
అంతర్గతంగా నేను రాసిన లేఖను బయటపెట్టిందెవరు?
హైదరాబాద్: బీజేపీతో బీఆర్ఎస్ పార్టీ కలవడమంటే లిక్కర్ నేరాన్ని అంగీకరించినట్లవుతుందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(BRS MLC Kalvakuntla Kavitha) అన్నారు. గురువారం నాడు సొంత పార్టీ నేతలపై కవిత విమర్శలు చేసిన విషయం తెలిసిందే. నేడు మంచిర్యాల జిల్లాలో పర్యటించిన కవిత మీడియా చిట్ చాట్ లో మాట్లాడారు. మంచిర్యాలకు వెళ్లిన ఎమ్మెల్సీ కవిత జాగృతి కార్యకర్తలు స్వాగతం పలికారు. నస్పూర్ లో కార్యకర్తలు కందుల ప్రశాంత్, శశి ఇంటికి కవిత వెళ్లారు. సీసీసీ నస్పూర్ లోని తెలంగాణ తల్లి విగ్రహానికి కవిత పూలమాల వేశారు. ఈ సందర్భంగా పార్టీని కాపాడుకోవాలనే తన తాపత్రయం అన్నారు. కేసీఆర్ కు నోటీసులు ఇస్తే.. ఎందుకు స్పందించలేదని కవిత ప్రశ్నించారు. పదేళ్లుగా ఎంతో ఆవేదనతో ఉన్నానని చెప్పారు. భాగ్యరెడ్డి వర్మ, పీవీ వర్థంతులను తొలుత నిర్వహించింది జాగృతేని కవిత గుర్తుచేశారు. యువతకు అవకాశం కల్పిచాలనేదే తన తాపత్రయం అన్నారు. సింగరేణి ప్రాంతంలోని జాగృతిలో యువతకు అవకాశం కల్పించామని పేర్కొన్నారు.
నేను జైలులో ఉన్నప్పుడే బీజేపీతో కలవాలనే ప్రతిపాదన వస్తే వ్యతిరేకించానని చెప్పారు. బీజేపీతో పొత్తు పెట్టుకున్న పార్టీలకు భవిష్యత్ లేదని కవిత సూచించారు. కేసీఆర్(Kalvakuntla Chandrashekar Rao)ను కలుద్దామనుకున్నా.. ప్రతిసారీ ఆయన ప్రజలతోనే ఉంటారని వివరించారు. పార్టీ నుంచి తనను బహిష్కరిస్తారని అనుకోవడం లేదని ఎమ్మెల్సీ కవిత తెలిపారు. అంతర్గతంగా మాట్లాడాలని చెప్పేవారు ఆలోచించుకోవాలని వెల్లడించారు. అంతర్గతంగా నేను రాసిన లేఖను బయటపెట్టిందెవరు? అని కవిత ప్రశ్నించారు. ఇవన్నీ అంగర్గతంగా జరిగినవే అన్నారు. వాస్తవాలను గుర్తించాలనేదే నా ఆలోచన కవిత స్పష్టం చేశారు.