20-02-2026 12:52:58 AM
పక్షం రోజుల పాటు సమావేశాలు!
హైదరాబాద్, ఫిబ్రవరి 19 (విజయక్రాంతి) : తెలంగాణ అసెంబ్లీ బడ్జె ట్ సమావేశాలకు రంగం సిద్ధమైంది. ఈనెల 26 నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లుగా తెలిసింది. 28న 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను డిప్యూటీ సీఎం, రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఈసారి సంక్షేమ పథకాలు, మౌలిక సదుపాయాల కల్పనకు బడ్జెట్లో పెద్దపీట వేయనున్నట్లు తెలుస్తోంది.
రైతు సంక్షేమం, మహాలక్ష్మి, ఇందిరమ్మ ఇళ్లు, గృహజ్యోతి వంటి ఆరు గ్యారెంటీల అమలుకు భారీగా నిధులు కేటాయించే అవకాశం ఉంది. కొత్త సంక్షేమ పథకాలు, నీటిపారుదల, పట్టణాభివృద్ధి వంటి అంశాలపైనా ప్రభుత్వం దృష్టి సారించను న్నట్లు తెలుస్తోంది. గత బడ్జెట్ కంటే ఈసారి కేటాయింపులు భారీగా ఉండే అవకాశం ఉందని సమాచారం. ఆర్థిక శాఖ బడ్జెట్ ప్రతిపాదనలకు సంబంధించి తుది మెరుగులు దిద్దుతోంది.
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క శాఖల వారీగా ప్రీ బడ్జెట్ సమావేశాలు నిర్వహించారు. అన్ని శాఖల మంత్రులు, అధికారులతో భట్టి విక్రమార్క సమీక్షలు నిర్వహంచారు. 10 నుంచి 15 రోజుల వరకు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలనే ఆలోచనతో సర్కార్ ఉన్నట్లుగా తెలిసింది.
సభలో ప్రతిపక్షాలు లేవనెత్తిన అంశాలకు సమాధానం ఇవ్వడంతో పాటు, పలు కీలక బిల్లులను కూడా ఈ సమావేశాల్లోనే అమోదించాలని ప్రభుత్వం భావిస్తోంది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలోనే రాష్ట్ర మంత్రివర్గం 23న సమావేశం కానున్నట్లు తెలిసింది. సమావేశంలో బడ్జెట్పై తుది నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం.