01-09-2024 12:00:00 AM
తెలంగాణలో ఇప్పుడు ఎక్కడ చూసినా ‘హైడ్రా’ మీదే చర్చ. పొద్దు న లేచి పేపర్ చూసినా, టీవీలోనూ దూసుకువస్తున్న బుల్డోజర్లు, నేలమట్టమవుతున్న భవనాలకు సంబంధించిన వార్తలు, ఫొటోలే దర్శనమిస్తున్నాయి. ‘హైడ్రా’ అనేది ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆలోచనలనుంచి పుట్టుకొచ్చిన వ్యవస్థ . ‘ధర్మాన్ని నిలబెట్టడం కోసం ఒక యోధు డు పోరాడడం కంటే మెరుగైన ప్రత్యామ్నాయం లేదు అని భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పిన బోధనలను అనుసరించి ధర్మాన్ని రక్షించడంకోసం యుద్ధం చేస్తున్నాం. కబ్జాదారుల చెరనుంచి చెరువులను రక్షిస్తున్నాం’ అంటూ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి శ్రీకృష్ణ జన్మాష్టమి నాడు హైడ్రా ఏర్పాటు వెనుక ఉద్దేశాన్ని స్పష్టం చేశారు.
అంతేకాదు ‘చెరువులను కబ్జా చేసే వారి భరతం పడతాం’ అంటూ గర్జించారు.ముఖ్యమంత్రి వ్యాఖ్యలు ఎలా ఉన్న ప్రకృతిని ధ్వంసం చేస్తే అది ప్రకోపిస్తుందని ఎన్నో అనుభవాలు చాటుతున్నాయి. హిమాచల్ప్రదేశ్లో నాలుగేళ్ల క్రితం చార్ధామ్లో ప్రకృతి విరుచుకుపడితే ఎంతటి విధ్వంసం జరిగిందో అందరికీ తెలుసు. ఈ మధ్య చెన్నైలో, మొన్నటికి మొన్న వయనాడ్లో అలాంటి పరిస్థితులనే చూశాం. ప్రకృతి సంపదను పరిరక్షించి భావితరాలకు అందించాల్సిన బాధయత ప్రతిఒక్కరిపైనా ఉంది. అందుకే భావితరాలకోసం పూర్వీకులు ప్రసాదించిన చెరువులు, కుంటల పరిరక్షణకు రేవంతరెడ్డి ప్రభుత్వం పూనుకోవడం అభినందనీయమే.
సమర్థుడిగా పేరున్న ఐఏఎస్ అధికారి రంగనాథ్ను హైడ్రాకు కమిషనర్గా నియమించడమే రేవంత్రెడ్డి ఈ విషయంలో ఎంత చిత్తశుద్ధితో ఉన్నారో చెబుతుంది. సినీ నటుడు నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ను కూల్చివేయడంతో ‘హైడ్రా’కు ప్రజల మద్దతు పెరిగింది. గతంలోనే దీనిపై అనేక ఆరోపణలు వచ్చాయి. ఎన్ కన్వెన్షన్తో పాటుగా గండిపేట చెరువులోని 15 ఎకరాల ఆక్రమణలనూ తొలగించింది హైడ్రా. ఈ ఆక్రమణల్లో కాంగ్రెస్ సహా అన్ని పార్టీలకు చెందిన నేతల నిర్మాణాలు కూడా ఉన్నాయి.
ఇక ప్రతిరోజూ ఎక్కడో ఒక చోట చెరువును ఆక్రమించి నిర్మించిన అక్రమ కట్టడాలను హైడ్రా బుల్డోజర్లు కూల్చివేస్తూనే ఉన్నాయి. జోరు వర్షంలోనే బుల్డోజర్లు తమ పని తాము చేసుకుపోతున్నాయి. అందుకే హైడ్రాకు ప్రజలు నీరాజనం పడుతున్నారు. ఇదంతా ట్రైలర్ మాత్రమేనని, అసలు సినిమా ముందుందన్న సంకేతాలను అది పంపుతోంది. బీఆర్ఎస్ నేతలు మల్లారెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీకి చెందిన విద్యాసంస్థలకు కూడా నోటీసులు జారీ చేయడంతో ఇది కాస్తా రాజకీయ వివాదంగా మారుతోంది.
తమ సంస్థల జోలికి వస్తే సహించేది లేదని ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ హెచ్చరిస్తే జీహెచ్ఎంసీ కార్యాలయం, నెక్లెస్ రోడ్డు కూడా చెరువును అక్రమించి నిర్మించినవేనని, వాటిని కూడా కూలుస్తారా? అని అసదుద్దీన్ ప్రశ్నిస్తున్నారు. మరోవైపు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు చెందినదిగా చెప్తున్న జన్వాడ ఫామ్హౌస్పైనా దృష్టిపెట్టడంతో ఆ పార్టీ భగ్గుమంటోంది. కాంగ్రెస్ నేతల్లో చాలామంది కూడా చెరువులను ఆక్రమించి ఫామ్హౌస్లు కట్టుకున్నారని, వాటి మాటేమిటని ఆ పార్టీ నేతలు ప్రశ్నిస్తున్నారు.
అయితే ముఖ్యమంత్రి సోదరుడి నివాసానికి కూడా నోటీసులు ఇచ్చామని ఎవరినీ వదిలిపెట్టేది లేదని అధికార పార్టీ నేతలు అంటున్నారు. అయితే సీపీఐ నేతలు అంటున్నట్లుగా రేవంత్ పులిమీద స్వారీ చేస్తున్నారా? ఈ ఆక్రమణ తొలగింపు పేరుతో పెద్ద రాజకీయ దుమారానికి శ్రీకారం చుడుతున్నారా? రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఇదంతా చేస్తున్నారా? అన్న చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. ఏది ఏమయినా హైడ్రా చేపడుతున్న అక్రమణల తొలగింపునకు సామాన్యుల నుంచి విశేష మద్దతు లభిస్తున్నదన్నమాట నిజం. అయితే ఈ వివాదంలో చెరువులు ఆక్రమించి నిర్మించిన భారీ వెంచర్లలో అపార్ట్మెంట్లు కొనుగోలు చేసిన వేలాది మంది పరిస్థితి ఏమిటనేది పెద్ద ప్రశ్న.