10-06-2025 01:28:30 AM
స్టూడెంట్ బస్పాస్ ఛార్జీలు 50% పెరుగుదల
హైదరాబాద్, జూన్ 9 (విజయక్రాంతి): తెలంగాణ ఆర్టీసీ చడీచప్పుడు కాకుండా సాధారణ ప్రయాణికులతో పాటు స్టూడెంట్ బస్పాస్ ఛార్జీలను సోమవారం భారీగా పెంచేసింది. స్టూడెం ట్ బస్పాస్ నెలకు రూ.400 ఉండగా దాన్ని 50శాతం మేర పెంచి రూ. 600గా నిర్ణయించింది. ఇది వరంగల్, హైదరాబాద్ విద్యార్థులకు వర్తిస్తుంది. ఇదే బస్పాస్ 3నెలల (క్వార్టర్లీ)కు గాను 50 శాతం మేర పెంచి రూ.1,200 నుంచి రూ.1,800కు పెంచారు.
ఇక సాధారణ ప్రయాణికులకు వర్తించే జనరల్ ఆర్డినరీ బస్టికెట్ (జీబీటీ) పాస్ ధరలను సైతం పెంచారు. ప్రస్తుతం నెలకు రూ.1,150 ఉన్న ఆర్డినరీ బస్పాసును 21.74శాతం పెంచి రూ.1,400కు మార్చారు. ఇక మెట్రో ఎక్స్ప్రెస్ పాసును రూ.1,300 నుంచి 23.08శాతం పెంచి రూ.1,600కు పెంచారు. మెట్రో డీలక్స్ పాసును రూ. 1,450 నుంచి రూ.1,800 (24.14శాతం)కు పెంపుదల చేశారు.
గ్రీన్ మెట్రో లగ్జరీ ఏసీ పాసును రూ.1,800 ప్లస్ జీఎస్టీ నుంచి రూ.2,200 ప్లస్ జీఎస్టీగా పెంచారు. ఇక ఎంఎంటీఎస్, ఆర్టీసీ కాంబో టికెట్ ధరను రూ.1,350 నుంచి రూ.1,650కు పెంచుతున్నట్లు ఆర్టీసీ అధికారులు వెల్లడించారు. కొత్త బస్పాస్ ఛార్జీలు సోమవారం నుంచే అమ లులోకి వచ్చాయి. అలాగే ఎన్హెచ్ఏఐ టోల్ఛార్జీలు పెంచిందంటూ టోల్ గేట్ల మీదుగా ప్రయాణించే బస్సుల్లో ఇకపై రూ.10 అదనంగా ఛార్జీ వేస్తున్నట్లు ఆర్టీసీ యాజమాన్యం తెలిపింది. టోల్ గేట్ల మీదుగా వెళ్లే బస్సుల్లోనే ఇది వర్తిస్తుందని ఆర్టీసీ వెల్లడించింది.
విద్యార్థి సంఘాల మండిపాటు..
విద్యార్థుల బస్పాస్ ఛార్జీల పెంపుపై విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి. నగరంలో అనేక మంది పేద విద్యార్థులు ఉన్నత విద్య కోసం ఆర్టీసీ బస్సులపై ఆధారపడుతున్నారని..వారిని ప్రభుత్వం ప్రోత్సహించేలా ఉండాలి కానీ ఛా ర్జీల పెంపుతో ఇబ్బందులు పెడుతోందన్నా రు. ఒకేసారి 50శాతం మేర పెంచి విద్యార్థులకు భారంగా మార్చడం తగదని బస్పాస్ ఛార్జీల పెంపుపై పునరాలోచన చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
గత 3 ఏళ్లుగా పెంచలేదు: ఆర్టీసీ యాజమాన్యం
గత 3 ఏళ్లుగా ఆర్టీసీ స్టూడెంట్ బస్పాసుల ఛార్జీలు పెంచలేదని ఆర్టీసీ యాజమాన్యం ఒక ప్రకటనలో తెలిపింది. పెరిగిన ఖర్చుల కారణంగా సోమవారం నుంచి స్టూడెంట్, నెలవారీ బస్పాస్ ఛార్జీలను పెంచినట్లు వెల్లడించింది. వరంగల్, హైదరాబాద్ నగరాల్లో ఆర్టీసీ ఆర్డినరీ బస్సులపై అధిక ప్రయాణికుల ఒత్తిడి పడుతోందని అందుకే రద్దీని నియంత్రించేందుకు నగరంలోని మెట్రో ఎక్స్ప్రెస్లలో కూడా విద్యార్థుల పాస్లను అనుమతించనున్నట్లు వెల్లడించింది.