త్వరలో ధాన్యం కొనుగోలు
హైదరాబాద్, మార్చి 20(విజయక్రాంతి): రబీ సీజన్ (2025 -26) ధాన్యం కొనుగోళ్లు మరో రెండు వారాల్లో ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా అదనపు గోదాములను వెంటనే గుర్తించి సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్లను పౌరసరఫరాల శాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర ఆదేశించారు. పౌరసరఫరాల భవన్లో రాష్ట్ర రైస్ మిల్లర్లతో శుక్రవారం కమిషనర్ సమావేశం నిర్వహించారు.
ధాన్యం అన్లోడ్ చేయడంలో ఎలాంటి ఆలస్యం జరగకుండా, అన్ని కొనుగోలు కేంద్రాల్లో తగినంత మంది హమాలీలను (కార్మికులను) ఏర్పాటు చేయాలని అధికారులు, మిల్లర్లను ఆదేశించారు. ఈ సీజన్లో ధాన్యం ప్యాకింగ్ అవసరాలను తీర్చడానికి, గోనె సంచుల కేటాయింపులపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. మిల్లర్ల వద్ద ఇంకా 35 కోట్ల పాత గోనెసంచులు పెండింగ్లో ఉన్నాయని, రబీ కొనుగోళ్లకు ఇబ్బం ది లేకుండా వెంటనే 10 కోట్ల సంచులను జిల్లా మేనేజర్లకు తిరిగి ఇవ్వాలని మిల్లర్లను ఆదేశించారు. అంతేకాకుండా, 2025- 26 ఖరీఫ్ సీజన్కు సంబంధించి ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లెక్కలను అధికారులు ఖరారు చేశారు. పెండింగ్లో ఉన్న బకాయిలు, ఇతర సమస్యలపై మిల్లర్ల నుంచి కమిషనర్ వినతిపత్రాలను స్వీకరించారు.




