08-06-2025 01:09:20 AM
ఏఐసీసీ గ్రీన్సిగ్నల్.. సామాజికవర్గాల వారీగా కసరత్తు
వీరికి చాన్స్..
హైదరాబాద్, జూన్ 7 (విజయక్రాంతి): తెలంగాణలో మంత్రివర్గ విస్తరణకు కాంగ్రెస్ అధిష్ఠానం ముహూర్తం ఖరారు చేసింది. ఆదివారం మధ్యా హ్నం విస్తరణపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఇక మంత్రి పదవుల ప్రకటన ఎప్పుడెప్పుడు వస్తుందా.. అని ఎదురుచూసిన ఆశావ హుల ఉత్కంఠకు తెరపడనున్నది. మంత్రివర్గ విస్తరణపై ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, పీసీసీ చీఫ్ మహేశ్కుమార్ గౌడ్ అనేకసార్లు ఢిల్లీకి వెళ్లారు.
పార్టీ పెద్దలను కలిసి చర్చలు జరిపారు. మళ్లీ తెలంగాణకు వచ్చి ఇక్కడ కూడా పార్టీ నేతలు చర్చలు జరిపారు. సీఎం, పీసీసీ చీఫ్ శుక్రవారం పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్తో భేటీ అయ్యారు. మంత్రివర్గవిస్తరణపై పక్కాగా కసరత్తు చేసి, అనంతరం పార్టీ అధిష్ఠానానికి కొందరి పేర్లను సూచించినట్లు తెలిసింది.
ఆ తర్వాతే అధిష్ఠానం మంత్రి వర్గ విస్తరణకు గ్రీన్సిగ్నల్ ఇచ్చినట్లు తెలిసింది. అంతా అనుకున్నట్లు జరిగితే ఆదివారం కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారమూ చేసే అవకాశాలు ఉన్నాయి. ముగ్గురు లేదా నలుగురికి మంత్రివర్గంలో చోటు దక్కే అవకాశం ఉన్నట్లు సమాచారం.
మంత్రివర్గంలో మొత్తం ఆరు బెర్త్లు ఖాళీ ఉండగా, అధిష్ఠానం ఎస్సీ సామాజికవర్గం నుంచి ముగ్గురు, బీసీ నుంచి ఒకరు, ఓసీ నుంచి ఒకరికి మంత్రి పదవులు కట్టబెట్టే అవకాశం కనిపిస్తున్నది. ఎస్సీ మాదిగ సామాజికవర్గం నుంచి మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, ధర్మ పురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి.
అలాగే మాల సామాజికవర్గం నుంచి ఓ ఎమ్మెల్యే పేరు, బీసీ ముదిరాజ్ సామాజికవర్గం నుంచి మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి, రెడ్డి సామాజికవర్గం నుంచి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్రెడ్డి పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నది. వీరిలో ముగ్గురు లేదా నలుగురికి మంత్రి పదవులు దక్కుతాయని తెలిసింది. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామా బాద్, రంగారెడ్డి వంటి ఉమ్మడి జిల్లాల నుంచి మంత్రివర్గంలో ప్రాతినిధ్యం లేదు.
కాబట్టి ఆ మూడు జిల్లాల నుంచి మంత్రివర్గంలో చోటు కల్పించాలనే డిమాండ్ పెద్ద ఎత్తున ఉంది. ఏదేమైనా సామాజికవర్గాల వారీగా బేరీజు వేస్తూ, ఆచితూచి వ్యవహరిస్తూ అధిష్ఠానం ముందుకు వెళ్తున్నట్లు తెలుస్తున్నది. పార్టీకి నష్టం జరగకుండా, క్యాడర్ నుంచి పెద్దగా వ్యతిరేకత రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు సమాచారం. కొత్త మంత్రు ల ప్రమాణ స్వీకారోత్సవ నిర్వహణ కోసం ఇప్పటికే గవర్నర్ జిష్ణుదేవ్శర్మకు సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది.
మాకూ అవకాశం ఇవ్వండి..
సీఎంకు మాదిగ సామాజికవర్గ ఎమ్మెల్యేల విజ్ఞప్తి
మంత్రివర్గంలో తమకూ అవకాశం కల్పించాలని మాదిగ సామాజికవర్గానికి చెందిన ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్, మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య శనివారం హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని సీఎం నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిని కలిసి విజ్ఞప్తి చేశారు. వీరంతా ఇటీవల ఢిల్లీకి వెళ్లి పార్టీ పెద్దలను కలిసి, ఇదే విషయాన్ని విన్నవించిన సంగతి తెలిసిందే.