19-03-2025 01:31:44 AM
పోలీస్ కమిషనర్ సునీల్ దత్
ఖమ్మం, మార్చి 18 ( విజయక్రాంతి ): రియల్ ఎస్టేట్ ముసుగులో అక్రమాలకు పాల్పడుతూ అమాయకుల నుండి లక్షల రూపాయల దోచుకుంటున్న రియల్ ఎస్టేట్ వ్యాపారులపై సీసీఎస్ పోలీసులు కేసు నమోదు చేసినట్లు పోలీస్ కమిషనర్ సునీల్ దత్ తెలిపారు.
ఖమ్మం ఆర్బన్ మండలం అగ్రహారం ప్రాంతంలోని సర్వే నెంబరు 42/ఇ , 42/ఇ ఇ లో తమకు సంబంధం లేని పలు ప్లాట్ల పై తప్పుడు డాక్యుమెంట్స్ సృష్టించి పలువురికి విక్రయించి మోసం చేసిన మానుకొండ శ్రీనివాస్ (ఖమ్మం రూరల్ మండలం నాయుడుపేట) తల్లాపల్లి రాజగిరి, (ఖమ్మం టౌన్)
సిలివెరూ రవి (శ్రీనివాస్ నగర్, ఖమ్మం) ప్రాంతానికి చెందిన ఈ ముగ్గురు కలసి 5 లక్షల రూపాయల వరకు మోసం చేశారని, అదేవిధంగా మరో ఇద్దరు నుండి 25 లక్షల వరకు తీసుకొని మోసం చేశారని ఖమ్మం పార్శిబందం ప్రాంతానికి చెందిన వినుకొండ మరియన్న ఫిర్యాదు చేయడంతో సీసీయస్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసి, విచారణ జరిపినట్లు తెలిపారు.
ముఖ్యంగా భూములు, ప్లాట్లు కొనుగోలు చేసే ముందు సంబంధిత పత్రాలు సక్రమంగా వున్నది లేనిది క్షేత్రస్దాయిలోకి వెళ్లి పరిశీలించుకోవాలని సూచించారు. ఇటీవల రియల్ ఎస్టేట్ వ్యాపారులు/ భూమి యాజమానలు ప్లాట్ల అభివృద్ధి పేరుతో ఫైనాన్సర్ల నుండి డబ్బు తీసుకొని ఫైనాన్సర్లకు రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. అదే ప్లాట్లను మరొకరికి జిపిఏ చేసి డబ్బులు తీసుకొని రిజిస్ట్రేషన్ చేయకుండా మోసం చేస్తున్నట్లు పలు ఫిర్యాదులు వస్తున్నాయని సీపీ తెలిపారు.