calender_icon.png 8 June, 2025 | 2:32 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కుల గణన షెడ్యూల్‌ను ఉపసంహరించుకోవాలి

06-06-2025 12:27:18 AM

  1. ఈ ఏడాదే బీసీలను గుర్తించాలి
  2. 2026లో కుల గణనను పూర్తి చేయాలి
  3. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్

ముషీరాబాద్, జూన్ 5: దేశ వ్యాప్తంగా జన గణనతో పాటే కులగణనను 2027లో చేపడుతామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన షెడ్యూలును ఉపసంహరించుకోవాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్, బీసీ  ఇంటలెక్చువల్స్ ఫోరం చైర్మన్ టీ చిరంజీవులు డిమాండ్ చేశారు. ఈ ఏడాదే బీసీ కుటుంబాలను గుర్తించి, 2026లో కుల గణనను పూర్తి చేయాలని డిమాండ్ చేశారు.

గురువారం బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో బీసీ కుల సంఘాల జేఏసీ కన్వీనర్ బాలగోని బాలరాజుగౌడ్ అధ్యక్షతన జరిగిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. 2027 లో కులగణన చేసే కేంద్రం ఇప్పుడే ఎందుకు ప్రకటించిందని ప్రశ్నించారు. 2025లోనే విధివిధానాలను రూపొందించి కులగణన ప్రక్రియను ప్రారంభించాలని డిమాండ్ చేశారు. దేశ వ్యాప్త కులగణన కోసం మంత్రివర్గ ఉప సంఘాన్ని నియమించాలని కోరారు.

కులగణన మొదలుపెట్టి సంపూర్ణంగా పూర్తయ్యే వరకు, జనాభా దమాషా ప్రకారం రిజర్వేషన్లు పెంచే వరకు ఉద్యమాన్ని ఆపేది లేదని హెచ్చరించారు. కులగణనపై కేంద్రం అనుసరించాల్సిన విధివిధానాలు, ప్రశ్నావళి, కులాల సామాజిక స్థితిగతులపై పూర్తిగా అధ్యయనం చేసి కేంద్ర ప్రభుత్వానికి బీసీ సమాజం తరఫున నివేదిక ఇవ్వడానికి జూన్ రెండో వారంలో హైదరాబాదులో బీసీ మేధావులతో సమావేశాన్ని ఏర్పాటు చేస్తామన్నారు.

జూలై మొదటి వారంలో ఢిల్లీలో కులఘనణపై అఖిలపక్ష ఓబీసీ సంఘాలతో సమావేశం ఏర్పాటు చేస్తామని తెలిపారు. సమావేశంలో కుల్కచర్ల శ్రీనివాస్ ముదిరాజ్, పరి శేఖర్ సగర, ఎం చంద్రశేఖర్ గౌడ్, ఐలి వెంకన్న గౌడ్, మాదేశి రాజేందర్, గణం నరసింహ, రామరాజు, శ్రీకాంత్ నేత, బండి గారీ భరత్ తదితరులు పాల్గొన్నారు.