27-05-2025 12:47:48 AM
మహబూబాబాద్, మే 26 (విజయ క్రాంతి): పశుసంపదకు విద్యుత్ శాఖ ‘శాపం’గా మారింది. ఇటీవల విద్యుదాఘాతంతో వందలాది పశువులు మృత్యువాత పడుతున్నాయి. ఇబ్బడి ముబ్బడిగా ఎడ్లు, గేదెలు ఇతర పశువులు విద్యుదాఘాతానికి గురై మరణిస్తుండడంతో అన్నదాతలకు ఆర్థికంగా నష్టం కలిగించడంతోపాటు సాగుకు కష్టంగా మారుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇటీవల కాలంలో ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా అనేక చోట్ల విద్యుదాఘాతానికి గురై ఎడ్లు, పాడి గేదెలు దుర్మరణం పాలైన ఘటనలు కో కొల్లలుగా జరుగుతున్నాయి. ఒక్కో ఎద్దు కనీసం 50 వేల వరకు విలువ చేస్తుండగా, విద్యుదాఘాతానికి గురై అవి మరణించడంతో వ్యవసాయం చేయడానికి రైతులకు దిక్కుతోచని పరిస్థితి నెలకొంది.
పరిహారం ఇప్పటికిప్పుడే ఇచ్చే పరిస్థితి లేకపోవడం, పశువులనే నమ్ముకొని వ్యవసాయం చేసే రైతులకు విద్యుత్ షాక్ శాపంగా మారిందని చెబుతున్నారు. ప్రతిరోజు ఎక్కడో చోట విద్యుత్ ప్రమాదం పూర్తి చేసుకొని పశువులు చనిపోతున్న ఘటనలు జరుగుతున్నాయి. మహాదేవపూర్ వద్ద 32 కేవీ విద్యుత్ లైన్ తెగిపోవడంతో మేతకు వెళ్లిన 8 దుక్కిటెడ్లు దుర్మరణం చెందాయి.
ఈ ఘటనలో సుమారు 6 లక్షల రూపాయలు అన్నదాతలు ఆర్థికంగా నష్టపోయారు. ఇదే తరహాలో మహబూబాబాద్ జిల్లా ఉగ్గంపల్లి లో నాలుగు ఎడ్లు తెగిపడ్డ విద్యుత్తు లైన్ కు తాకి మరణించాయి. ఈ సంఘటనలో 2 లక్షల రూపాయలు ఆర్థికంగా రైతులు నష్టపోయారు. ఇలాగే గత రెండు రోజులుగా మహబూబాబాద్ జిల్లాలో జరిగిన విద్యుత్ ప్రమాదాల్లో రెండు గేదలు మరణించాయి.
పూర్తిగా విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యం ఫలితంగానే పశువుల మరణానికి కారణమని రైతులు ఆరోపిస్తున్నారు. తెగిపడ్డ విద్యుత్తు లైనులను వెంటనే మరమ్మతు చేయకపోవడం, విద్యుత్ సరఫరా నిలిపివేకపోవడం వల్ల పశువుల మరణానికి కారణంగా మారిందని చెబుతున్నారు. ఇదిలా ఉంటే అప్పో సొప్పో చేసి తిరిగి పశువులను కొనుగోలు చేయడం కష్టంగా మారిందని చెబుతున్నారు.
ఇప్పటికే పశుసంపద గణనీయంగా తగ్గిపోగా, పశువులను విద్యుత్ కాటేస్తుండడంతో పశు సంపద పునరుత్పత్తికి ఆటంకంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం విద్యుత్ ప్రమాదాలు జరగకుండా ముందస్తు నివారణ చర్యలు తీసుకోవాలని విద్యుత్ సంస్థలను ఆదేశించినప్పటికీ క్షేత్రస్థాయిలో ఆ తరహాలో పనులు చేయడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు.
అనేక చోట్ల నేల బారిన విద్యుత్ స్తంభాలు, భూమికి రెండు అడుగుల ఎత్తులో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ల ఏర్పాటు, అనేక చోట్ల సరైన ఎర్త్ అమర్చకపోవడం, తెగిపోయిన విద్యుత్తు లైన్లను వెంటనే సరి చేయకపోవడం వల్ల విద్యుత్ ప్రమాదాల సంఖ్య పెరగడానికి కారణంగా చెబుతున్నారు.
నష్ట నివారణ చర్యలు చేపట్టాలి
విద్యుత్ ప్రమాద ఘటనలు చేసుకోకుండా కేవలం ప్రచారంతో సరిపెట్టకుండా నష్ట నివారణ చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. ప్రమాదాలకు కారణంగా మారుతున్న ట్రాన్స్ఫార్మర్ల వద్ద చుట్టూ పటిష్టమైన రక్షణ కంచే ఏర్పాటు చేయాలి. అలాగే అనేకచోట్ల చేతికందే విధంగా ఉన్న ట్రాన్స్ఫార్మర్లను ఎత్తుగద్దెలపై ఏర్పాటు చేయాలి. నేలబారు విద్యుత్తు లైన్ల వద్ద మిడిల్ పోల్ వేయాలి.
శిధిలమైన విద్యుత్ స్తంభాలను తొలగించి కొత్తవి ఏర్పాటు చేయాలి. అలాగే చాలాకాలంగా వినియోగిస్తున్న విద్యుత్తు లైన్లను మార్చాలి. ప్రమాదాలు చోటు చేసుకోకుండా నిరంతరం పర్యవేక్షణ జరపాలి.
విద్యుత్ సరఫరా నిలిచిపోయిన వెంటనే ప్రమాద ఘటనలను తెలుసుకునే విధంగా చర్యలు చేపట్టాలి. గాలి వాన ఘటనలు జరిగినప్పుడు , విద్యుత్ సరఫరా పునరుద్ధరించకుండా పూర్తిస్థాయిలో సమాచారం సేకరించిన తర్వాత విద్యుత్ సరఫరా పునరుద్ధరిస్తే విద్యుత్ ప్రమాదాలు జరగడానికి ఆస్కారం ఉండదు.
బాధితులకు పరిహారం వెంటనే ఇవ్వాలి
విద్యుత్ ప్రమాద ఘటనల్లో ప్రాణాలు కోల్పోయిన మనుషులకు, పశువులకు సంబంధించి బాధితులకు వెంటనే పరిహారం అందించే విధంగా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. బాధితులు పరిహారం కోసం ఏళ్ల తరబడి విద్యుత్ సంస్థ, అధికారులు, ప్రజాప్రతినిధుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఎదురవుతుందని చెబుతున్నారు.
ఫలితంగా అటు ప్రాణాలు కోల్పోయి, ఇటు ఆర్థికంగా నష్టపోయి బాధితులు పరిహారం కోసం తిరగడానికి ఇబ్బందిగా మారిందని చెబుతున్నారు. ప్రమాద ఘటన జరిగిన వెంటనే పోలీస్, విద్యుత్ శాఖ అధికారులు విచారణ జరిపి బాధితులకు సత్వరం పరిహారం ఇప్పిస్తే ఊరటగా ఉంటుందని చెబుతున్నారు.
ఉపాధి కోల్పోయాను
వ్యవసాయంతో పాటు పశుసంపదతో అదనపు ఆదా యం పొందాలని, ఒక గేదె ను కొనుక్కున్నాను. ఆ గేదేకు మూడేళ్ల క్రితం జన్మించిన దూడ విద్యుత్ షాక్ తో మరణించింది. దీనితో పశుసంపద పెరిగే అవకాశం లేకుండా పోయింది. కరెంటు అధికారులు ట్రాన్స్ఫార్మర్ కిందకు ఏర్పాటు చేయడం వల్ల ప్రమాదం చోటుచేసుకుంది. నష్టపరిహారం అందించి ఆదుకోవాలి.
డు కేతిరి శ్రీనివాసరెడ్డి, రైతు, నారాయణపురం