మోదీ రాకతో రాష్ట్రంలో పండుగ
బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి ఎన్వీ సుభాష్
హైదరాబాద్, మే 3 (విజయక్రాంతి): ప్రధాని మోదీ తెలంగాణ పర్యటన- రాష్ట్రానికి అభివృద్ధి పండుగని బీజేపీ రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి ఎన్వి సుభాష్ తెలిపారు. మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన మొదటిసారి తెలంగాణ రాష్ట్రానికి వేల కోట్ల అభివృద్ధిని మూటగ ట్టుకొని వస్తున్నారని తెలిపారు. ఈ పర్యటనలో దాదాపు రూ.7,823 కోట్ల విలువైన ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టబోతున్నారని ఆదివారం ప్రకటనను విడుదల చేశారు.
రూ. 1,695 కోట్లతో ఏర్పాటు చేస్తున్న పీఎం మిత్ర కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ను జాతికి అంకితం చేస్తారని, మోదీ 5ఎఫ్ విజన్కు ఇది ఒక నిదర్శనమని తెలిపారు. బీబీనగర్ ఎయిమ్స్ రూపంలో రూ.2,000 కోట్లతో ఒక అద్భుతమైన దవాఖానాను కేంద్రం కట్టిందన్నారు. నరేంద్ర మోదీ సర్కార్ హయాంలో తెలంగాణ రైల్వేలకు వేలకోట్ల నిధులు వచ్చాయని, కాజీపేట- లైన్లు, కొత్త స్టేషన్లతో కనెక్టివిటీ పెరుగుతోందని పేర్కొన్నారు.
కేంద్రం వేల కోట్లు ఇస్తుంటే, ఇక్కడి కొన్ని పార్టీలు రాజకీయ ప్రయోజనాల కోసం అడ్డంకులు సృష్టిస్తున్నాయని మండిపడ్డారు. డీలిమిటేషన్ గురించి తప్పుడు ప్రచారాలు చేస్తున్నాయని, ఈనెల 10న సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో జరిగే బహిరంగ సభకు పెద్దఎత్తున తరలివెళ్లి దిగ్విజయం చేయాలని ఆయన కోరారు.






