calender_icon.png 13 June, 2025 | 1:38 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సివిల్ ఇంజినీరింగ్ అద్భుతం ‘చినాబ్’

11-06-2025 12:25:00 AM

  1. కొనియాడిన ఐఐఎస్‌సీ ప్రొఫెసర్ మాధవీలత
  2. 17 ఏళ్లు ప్రాజెక్టుకు అంకితమైన తెలుగు ఇంజినీర్
  3. ఆఫ్కాన్స్‌తో కలిసి జియోటెక్నికల్ కన్సల్టెంట్‌గా సేవలు
  4. వంతెన నిర్మాణం వెనుక కనిపించని హీరోలు చాలా మందే

న్యూఢిల్లీ, జూన్ 10: ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వే వంతెనగా పేరుపొందిన చినాబ్ వంతెనను గత శుక్రవారం ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇంజినీరింగ్ అద్భుతంగా అభివర్ణించిన చినాబ్ వంతెన నిర్మాణం వెనుక కనిపించని హీరోలు చాలా మందే ఉన్నారు.

వారిలో ప్రస్తుతం బెంగళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్‌సీ)లో ప్రొఫె సర్‌గా విధులు నిర్వర్తిస్తున్న డాక్టర్ జీ. మాదవీ లత ఒకరు. 17 ఏళ్ల పాటు చినాబ్ ప్రాజెక్టులో భాగమైన మాదవీలత తెలుగిం టి ఆడపడుచు కావడం మనకు గర్వకారణం. 

ఉధంపూర్ రైల్వే లింక్ (యూఎస్‌బీఆర్‌ఎల్)లో భాగంగా 272 కిలోమీటర్ల మేర చినాబ్ వంతెనను నిర్మించారు. ఐఐఎస్‌సీలో ప్రొఫెసర్‌గా ఉన్న మాధవీలత జియోటెక్నికల్ కన్సల్టెంట్‌గా చీనాబ్ వంతెన ప్రాజెక్టులో 17 సంవత్సరాలు పాల్గొన్నారు. వంతెన కాంట్రాక్టర్ అయిన ఆఫ్కాన్స్‌తో కలిసి మాధవీలత పని చేశారు. భూభాగం పరిస్థితులు, ప్రమాదాలను ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ వంతె న నిర్మాణం సక్రమంగా జరిగేలా సహకరించారు.

అత్యంత కఠినంగా ఉండే హిమాలయ ప్రాంతంలో సవాళ్లతో కూడుకున్న వంతెన నిర్మాణంలో మాధవీలత పాత్ర చాలా కీలకం. చినాబ్ వంతెన నిర్మాణం కోసం అన్ని అడ్డంకులను అధిగమించడం కోసం మాధవీ లత బృందం ‘డిజైన్ విధానం’ని అవలంబించింది.

దీనర్థం సర్వే ముందు కనిపించని రాతి లక్షణాలు, పగిలిన రాళ్లు, రాళ్లలో దాగిన రంధ్రాల వంటి వివిధ రాతి లక్షణాల వంటి భౌగోళిక పరిస్థితుల ఆధారంగా రియల్ టైమ్‌లో పనిచేయడం. నిర్మాణ సమయంలో కనుగొన్న రాతి పరిస్థితులపై పనిచేయడానికి మాధవీ లత బృందం రాతి యాంకర్ల రూపకల్పన, ప్లేస్‌మెంట్‌పై ఎప్పటికప్పుడు సలహాలు అందించారు. 

కనిపించని హీరోలందరికి సెల్యూట్

తాజాగా మంగళవారం మాధవీలత ‘చినాబ్ వంతెన’ ప్రారంభం కావడంపై ‘ఎక్స్’ వేదికగా తన సంతోషాన్ని పంచుకున్నారు. ‘చినాబ్ వంతెన దేశానికి దక్కిన అతి పెద్ద గౌరవం. ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వే వంతె న నిర్మాణంలో నేను భాగస్వామ్యమవ్వడం మరిచిపోలేని అనుభూతి. 17 ఏళ్ల పాటు ఒక ప్రాజెక్టులో భాగమయ్యి జియోటెక్నికల్ కన్సల్టెంట్‌గా ఆఫ్కాన్ సంస్థతో కలిసి వంతెన నిర్మాణంలో పలు కీలక సలహాలు, సూచన లు ఇవ్వడం గౌరవంగా భావిస్తున్నా.

అన్ని అడ్డంకులు దాటుకొని చినాబ్ వంతెనను ప్రధాని మోదీ ప్రారంభించడం గొప్ప విష యం. అందుకు భారతీయ ప్రజలకు కృతజ్ఞతలు. అయితే ఈ బ్రిడ్జి నిర్మాణం వెనుక కనిపించని హీరోలు చాలా మందే ఉన్నారు. వారందరికి పేరు పేరునా సెల్యూట్ చేస్తున్నా. 

చాలా మీడియా చానెళ్లు ఈ ప్రాజెక్టులో మహిళలు ఎక్కువ సంఖ్యలో భాగస్వామ్యమయ్యారని, అద్భుతాన్ని నిజం చేసి చూపారని రాసుకొచ్చారు. చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లల్ని నాలాగే తయారు చేయాలనుకుంటున్నట్టు ఉత్తరాలు రాయడం అభినందనీయం.

ఈ ప్రాజెక్టులో భాగమైనందుకు చాలా సంతోషిస్తున్నా. ప్రస్తుతం ఒక కాన్ఫరెన్స్ విషయమై స్పెయిన్‌లో ఉన్నా. నా ప్రైవసీకి భంగం కలిగించొద్దని విజ్ఞప్తి. దీని వెనుక భారతీయ రైల్వే కృషి అమోఘం..’ అని మాధవీ లత పేర్కొన్నారు.