పెంచిన ఛార్జీలను తగ్గించే వరకు పోరాటం చేస్తాం: ఎమ్మెల్సీ కవిత
హైదరాబాద్: ఆర్టీసీ బస్సు ఛార్జీల పెంపును నిరసిస్తూ మంగళవారం తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(MLC Kalvakuntla Kavitha) ఆధ్వర్యంలో జాగృతి కార్యకార్తలు బాగ్లింగంపల్లిలోని బస్ భవన్(Bus Bhavan) వద్ద ధర్నా నిర్వహించారు. కార్యకార్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని రాష్ట్ర ప్రభుత్వం ఛార్జీలను పెంచడాన్ని ఖండిస్తూ నినాదాలు చేశారు. ప్రదర్శన నిర్వహిస్తుండగా హైదరాబాద్ పోలీసులు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కె. కవితను ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు.
అనంతరం కవితను చంద్రాయణగుట్ట పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలపై రూ.300 అదనపు ఆర్థిక భారాన్ని మోపిందని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం టికెట్ రేట్లు పెంచడం ద్వారా ప్రజలను దోచుకోవడానికి ప్రయత్నిస్తోందని కవిత విమర్శించారు. పోలీసులు నిరసనను విరమించమని కవితను కోరారు. కవిత వెనక్కి తగ్గకపోవడంతో పోలీసులు ఆమెను ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు.






