ఇంట్లోనే పిల్లల మృతదేహాల ఖననం
వరంగల్, (విజయక్రాంతి): హైదరాబాదులోని మూసాపేటలో మరణించిన తల్లి స్రవంతి, పిల్లలు కార్తీక్, కౌశిక్ ల అంత్యక్రియలు బుధవారం రాత్రి వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం బోడ మాణిక్యం తండాలో ఉద్రిక్త పరిస్థితుల మధ్య నిర్వహించారు. ఇందులో తల్లి స్రవంతి మృతదేహానికి సమీప వ్యవసాయ పొలంలో అంత్యక్రియలు నిర్వహించగా, ఇద్దరు పిల్లల మృతదేహాలను మాత్రం తండ్రి ప్రవీణ్ ఇంట్లో ఖననం చేశారు. హైదరాబాదులో పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం మృతదేహాలను అంబులెన్స్ లో స్వగ్రామానికి తీసుకువచ్చారు. ఈ సంఘటన నేపథ్యంలో తండాలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. అంతకుముందే ప్రవీణ్ ఇంటిపై స్రవంతి కుటుంబ సభ్యులు బంధువులు దాడికి దిగారు.
ఈ క్రమంలో ముగ్గురి మృతదేహాలను ఇంట్లోనే ఖననం చేయడానికి ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఒక దశలో స్రవంతి బంధువులు, కుటుంబ సభ్యులు పోలీసులపైకి కారంపొడి చల్లి దాడికి దిగారు. తమకు న్యాయం చేయాలంటూ ఆందోళనకు దిగారు. ప్రవీణ్ ఇంటి ఆవరణలో మృతదేహాలను ఖననం చేయడానికి గొయ్యి తీశారు. అయితే నర్సంపేట ఏసిపి రవీందర్ రెడ్డి, నెక్కొండ దుగ్గొండి సిఐలు శ్రీనివాస్, సాయిరాం, చిన్నరావుపేట నెక్కొండ నర్సంపేట నల్లబెల్లి ఎస్ఐలు భారీ ఎత్తున పోలీసులు మోహరించి అడ్డుకున్నారు. దీనితో ఇద్దరు పిల్లల మృతదేహాలను ప్రవీణ్ ఇంటి వద్ద తీసిన గోతుల్లో ఖననం చేశారు.




