25-06-2025 12:21:46 AM
సిద్దిపేట, జూన్ 24 విజయక్రాంతి): ప్రతి నెల గ్రామాలలో బార్హక్కుల దినోత్సవం నిర్వహించి ఎస్సీ ఎస్టీల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య సూచించారు. పౌర హక్కుల దినోత్సవానికి తహసిల్దార్, ఎస్త్స్ర లతోపాటు జిల్లా స్థాయి అధికారులు తప్పనిసరిగా హాజరుకావాలని ఆదేశించారు. కిందిస్థాయి సిబ్బందిని పంపి నిర్వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. మంగళవారం కమిషన్ సభ్యులతో కలిసి సిద్దిపేట జిల్లా అధికారులతో సమీక్ష నిర్వ హించారు.
జిల్లాలో నమోదైన అట్రాసిటీ కేసుల వివరాలు తెలుసుకొని పరిష్కరించబ డినవి, పెండింగ్ ఉన్న కేసుల గురించి ఆరా తీశారు. గ్రామాలలో ప్రభుత్వ పథకాలపై సంపూర్ణ అవగాహన కల్పించి బాధితులకు లబ్ధి చేకూరేలా తక్షణ చర్యలు చేపట్టాలని చెప్పారు. జిల్లా ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ కమిటీ నియామకంపై ఇన్చార్జి మంత్రి వివేక్ తో చర్చిస్తానని చెప్పారు. జిల్లాలో బెస్ట్ అవైలబుల్ పాఠశాలలకు నిధుల మంజూరులో జాప్యం లేకుండా తగిన చర్యలు చేపట్టాలని తెలిపారు.
గడచిన విద్యా సంవత్సరంలో పదవ తరగతిలో 91.92 శాతం ఉత్తీర్ణత సాధించినందుకు విద్యాశాఖ అధికారులతో పాటు ఉపాధ్యాయులను అభినందించారు. జిల్లాలో బంజారా భవన్ నిర్మాణానికి అవసరమైన స్థలాన్ని కేటాయించాలని చెప్పారు. ఇందిరమ్మ ఇల్లు మంజూరైన ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారుల వివరాలు కమిషన్ అందజేయాలని, ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను ఎస్సీ, ఎస్టీ ప్రాంతాల్లోనే ఉపయోగించాలని, కాంట్రాక్టు పనులలో ఎస్సీ, ఎస్టీలకు వాటాల రిజర్వేషన్ ప్రకారం కేటాయించాలని ఎస్సీ, ఎస్టీల భూ సమస్యలను భూభారతి చట్టం ద్వారా తక్షణమే పరిష్కరించాలని తెలిపారు.
హరిజన అనే పదాన్ని నిషేధించినందున హరిజనవాడలకు బదులుగా దళితవాడ, ఎస్సీ కలనిలుగా మార్చేందుకు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానన్నారు. జిల్లాలో ఎస్సీ, ఎస్టీలకు జరిగిన అన్యాయాలపై అధికారులు తక్షణమే స్పందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ హైమావతి, జిల్లా పోలీస్ కమిషనర్ అనురాధ, ఎస్సీ, ఎస్టీ సభ్యులు లక్ష్మీనారాయణ, రాంబాబు నాయక్, లీలాదేవి, జిల్లా శంకర్, రేణిగుంట్ల ప్రవీణ్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ లింగమూర్తి, అదనపు కలెక్టర్లు గరీమ అగర్వాల్, అబ్దుల్ హమీద్, ఆర్ డి ఓ లు, డిఎస్పీలు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.