27 February, 2026 | 1:38 PM

Delhi Liquor Policy Case: లిక్కర్ స్కాంలో కవితకు క్లీన్ చిట్

27-02-2026 11:59 AM

లిక్కర్ కేసులో కవితకు క్లీన్ చిట్.

ఇచ్చిన రౌస్ అవెన్యూ కోర్టు.

ఐదు నెలల పాటు జైల్లో ఉన్న కవిత.

న్యూఢిల్లీ: ఢిల్లీ మద్యం పాలసీ కేసులో(Delhi liquor policy case) కల్వకుంట్ల కవితకు(Kalvakuntla Kavitha) భారీ ఊరట లభించింది. కవితతో పాటు ఆడిటర్ బుచ్చి బాబుతో సహా ఇతర నిందితులపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(Central Bureau of Investigation) నమోదు చేసిన కేసులను రౌస్ అవెన్యూ కోర్టు కొట్టివేసింది. ఈ కేసులో ఆప్ నాయకులు మనీష్ సిసోడియా, అరవింద్ కేజ్రీవాల్‌తో పాటు ఇతర నిందితులపై సీబీఐ దాఖలు చేసిన కేసును కూడా కోర్టు కొట్టివేసింది. రెండు వైపుల నుండి వివరణాత్మక వాదనలు విన్న తర్వాత ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి తీర్పు వెలువరించారు.

తన ఉత్తర్వులో, కోర్టు సీబీఐపై తీవ్ర విమర్శలు చేసింది. కేసు నమోదు, దర్యాప్తు విధానాన్ని తీవ్రంగా విమర్శించింది. ప్రక్రియలో తీవ్రమైన లోపాలను గమనించిన కోర్టు, కేసు నమోదు  దర్యాప్తు నిర్వహణ రెండింటిలోనూ ఏజెన్సీ విధానాన్ని తప్పుబట్టింది. చివరికి నిందితులందరిపై ఉన్న అభియోగాలను కొట్టివేస్తూ అరవింద్ కేజ్రీవాల్‌(Arvind Kejriwal), సిసోడియాతో పాటు కవితకు క్లీన్ చిట్ ఇచ్చింది. ఆధారాలు లేకుండా ఇరికించారని సీబీఐపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.  ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో 23 మంది తప్పు చేశారని సాక్ష్యాధారాలు లేవన్న కోర్టు స్పష్టం చేసింది.  లిక్కర్ కేసులో కవిత ఐదు నెలల పాటు జైల్లో ఉన్న విషయం తెలిసిందే.