నేడు తిరుపతి, నెల్లూరులో చంద్రబాబు పర్యటన
నెల్లూరు: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం నెల్లూరు, తిరుపతి జిల్లాలో పర్యటిస్తున్నారు. సోమశిల రిజర్వాయర్ పరిస్థితిని ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు సోమశిల ప్రాజెక్టును సీఎం సందర్శిస్తారని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ఆదివారం విడుదల చేసిన ప్రెస్ నోట్లో తెలిపారు. ఆత్మకూరు నియోజకవర్గంలోని పార్టీ నాయకులు, కార్యకర్తలు తప్పకుండా సోమశిల రిజర్వాయర్ వద్దకు తరలిరావాలని ఆయన కోరారు.
ఇటీవల తుంగభద్ర డ్యాం 19వ క్రష్ గేట్ కొట్టుకుపోవడంతో సోమశిల డ్యాంలోని ఆప్రాన్ వాల్, స్పిల్ వే, క్రష్ గేట్ల పరిస్థితిని స్వయంగా చూసేందుకు సోమశిల రిజర్వాయర్ను సందర్శించాలని సీఎం కోరినట్లు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. సోమశిల, కండేల్రు ప్రాజెక్టుల పరిస్థితి, రానున్న వర్షాకాలం దృష్ట్యా తీసుకోవాల్సిన ముందస్తు చర్యలపై ఇంజినీర్లతో సీఎం సమీక్ష నిర్వహించే అవకాశం ఉంది. మధ్యాహ్నం సత్యవేడు శ్రీసిటిలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. కొన్ని పరిశ్రమలకు సీఎం చంద్రబాబు భూమిపూజ, ప్రారంభోత్సవాలు చేయనున్నారు.






