రైలు ప్రమాద ఘటనపై మమతా బెనర్జీ దిగ్భ్రాంతి
కోల్కతా: పశ్చిమ బెంగాల్లోని న్యూ జల్పైగురి సమీపంలో సోమవారం ఉదయం గూడ్స్ రైలు కాంచన్జంగా ఎక్స్ప్రెస్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురు ప్రయాణికులు మరణించారని, 30 మంది గాయపడ్డారని డార్జిలింగ్ పోలీసు అదనపు ఎస్పీ అభిషేక్ రాయ్ తెలిపారు. పరిస్థితి తీవ్రంగా ఉందన్నారు. అగర్తల నుంచి న్యూ జల్పైగురి స్టేషన్కు సమీపంలో 13174 కాంచన్జంగా ఎక్స్ప్రెస్ను గూడ్స్ రైలు ఢీకొట్టింది. ఈ ఘటనపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆందోళన వ్యక్తం చేశారు. వైద్యులు, అంబులెన్స్లు, విపత్తు బృందాలను ప్రమాద స్థలానికి తరలించినట్లు చెప్పారు. అటు బెంగాల్ రైలు ప్రమాద ఘటన దురదృష్టకరమని మంత్రి అశ్వినీ వైష్ణవ్ అన్నారు. ఘటనాస్థలంలో యుద్ధప్రాతిపదికన సహాయ చర్యలు కొనసాగిస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. రైల్వే, ఎన్ డీఆర్ఎఫ్, ఎస్ డీఆర్ఎఫ్ సమన్వయంతో సహాయ చర్యలు చేపట్టినట్లు తెలిపారు.






