26-06-2025 08:59:20 PM
హైదరాబాద్: ఒకనాటి ఉద్యమాల గడ్డ తెలంగాణ మాదక ద్రవ్యాల మహమ్మారికి అడ్డాగా మారకూడదన్న లక్ష్యంతో ఇకనుంచి రాష్ట్రంలో ఒక మొక్క గంజాయి మెలిచినా ఇట్టే కనిపెట్టే “Elite Action Group For Drug Law Enforcement”(Eagle) ను ఏర్పాటు చేసినట్టు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ప్రకటించారు. నగరంలోని మాదాపూర్ శిల్పకళా వేదికలో అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం-2025(Anti-Drugs Day) కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రపంచంతో పోటీ పడే ఒక ఆరోగ్యకరమైన, మాదక ద్రవ్య రహిత తెలంగాణను నిర్మించుకోవడంలో ప్రభుత్వ సంకల్పానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు.
"తెలంగాణలో ఒకనాడు ఉద్యమాలకు వేదికలైన కాలేజీలు, యూనివర్సిటీలు గంజాయి, మాదక ద్రవ్యాలకు వేదిక అయితే అది అందరికీ అవమానం. యువకులు డ్రగ్స్ బారిన పడి బలవుతున్నారు. డ్రగ్స్ నియంత్రించడానికి ప్రతి ఒక్కరూ సహకరించాలి. పాఠశాల, కాలేజీల్లో ఎక్కడైనా సరే దీనికి సంబంధించిన సమాచారం ఉంటే వెంటనే తెలియజేయండని పేర్కొన్నారు. తల్లిదండ్రులు ఎంతో నమ్మకంతో విద్యార్థులను స్కూళ్లు, కాలేజీల్లో చేర్పిస్తుంటే, కేవలం చదువు చెబితే చాలన్నట్టు యాజమాన్యాలు, అధ్యాపకులు భావించడం సరికాదు. వాటిని నియంత్రించడంలో యాజమాన్యాలకు కూడా బాధ్యత ఉంటుందన్నారు.
కాలేజీల్లో డ్రగ్స్ ఆనవాళ్లు దొరికితే ఇక నుంచి వాటి యాజమాన్యాలపైన కూడా కేసులు నమోదు చేయండని, యాజమాన్యాలు, అధ్యాపకులు విద్యార్థినీ విద్యార్థుల నడవడికను కూడా గమనించాల్సి ఉంటుందని, డ్రగ్స్ నియంత్రణపై పాఠశాలలు, కాలేజీల యాజమాన్యాలతో నార్కోటిక్స్ బ్యూరో ఒక సమావేశం నిర్వహించాలని సీఎం తెలిపారు. 140 కోట్ల జనాభా ఉన్న భారత దేశంలో 68 శాతం యువత ఉంది. ఐటీతో సహా అన్ని రంగాల్లో దేశం ముందుకు వెళుతుంటే దెబ్బతీయడానికి, దేశాన్ని నిర్వీర్యం చేయడానికి ఇలాంటి డ్రగ్స్ మహమ్మారితో యువతను బలిగొనే కుట్రలు జరుగుతున్నాయని, దేశ రక్షణలో ముందు వరుసలో నిలుచున్న పంజాబ్, హర్యానా లాంటి రాష్ట్రాల్లో డ్రగ్స్ బారిన పడి యువత నిర్వీర్యమైపోతోందన్నారు.
డ్రగ్స్తో ఎవరైనా తెలంగాణలో కాలు పెట్టాలంటే వందసార్లు ఆలోచించాలని, ఒక గడ్డి పరకైనా రాష్ట్రంలో అడుగుపెట్టినా వెన్ను విరుస్తామని, ఐటీ హబ్గా, ఫార్మా హబ్గా ఉన్న తెలంగాణ గంజాయి, డ్రగ్స్ హబ్గా మారితే మనమంతా విఫలమైనట్టేనని, యువతను సరైన దిశగా నడిపించాల్సిన అవసరం ఉందన్నారు. యువతను సరైన దిశలో నడిపించాలన్న ఉద్దేశంతోనే క్రీడా పాలసీని తెచ్చాం.. నైపుణ్యాలను మెరుగుపరచడానికి స్కిల్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేశాం.. రేపటి రోజున ఎవరైనా క్రీడల్లో శిక్షణ తీసుకోవాలంటే తెలంగాణ వెళ్లాలన్న పరిస్థితి రావాలని, తెలంగాణను ఒక స్పోర్ట్స్ హబ్గా మార్చడానికి దక్షిణ కొరియా, ఆస్ట్రేలియా లాంటి దేశాల్లోని యూనివర్సిటీలతో ఒప్పందాలు చేసుకున్నామని సీఎం తెలిపారు.
ప్రపంచంతో పోటీ పడే శక్తి, యుక్తి దేశంలో ఉందని, తెలంగాణలోని 1 కోటి 50 లక్షల ఎకరాల్లో ఒక్క గంజాయి మొక్క మొలవొద్దు. ఒక్క గంజాయి మొక్క మొలిచినా ఈ Eagle (గద్ద) ఇట్టే పట్టేస్తుందని, ఈ గద్ద ఈరోజు నుంచే పనిచేస్తుంది” అని సీఎం తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రితో సహా కార్యక్రమంలో పాల్గొన్న వారందరూ మాదక ద్రవ్యాల నియంత్రణకు తెలంగాణ ప్రభుత్వ సంకల్పంలో భాగస్వాములం అవుతామని ప్రతిజ్ఞ చేశారు.