26-06-2025 09:02:41 PM
స్పిల్ వే వద్ద మెయింటెనెన్స్ పనులు చేయించడంలో నిర్లక్ష్యం...
డేంజర్ లోకి జూరాల....????
జూరాల ప్రాజెక్టు ను సందర్శించిన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు
వనపర్తి (విజయక్రాంతి): గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తెలంగాణలో సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేసి ప్రతి ఎకరాకు సాగునీరందించి సస్యశ్యామలం చేశామని, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రాజెక్టులపై చిత్త శుద్దిలేదని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్(Former Minister Srinivas Goud) విమర్శించారు. జూరాల ప్రియదర్శిని ప్రాజెక్టులోని తొమ్మిదో నెంబర్ గేట్ రోప్ తెగిపోయిందని వార్తలు వెలువడుతున్న నేపథ్యంలో గురువారం మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆద్వర్యంలో మాజీ ఎమ్మెల్యేలు చిట్టెం రాంమోహన్ రెడ్డి, లక్ష్మారెడ్డి, బీఆర్ ఎస్ నాయకులు జూరాల ప్రాజెక్టును అకస్మికంగా సందర్శించారు. డ్యాంకు వస్తున్న వరద నీటిని, డ్యాం గేట్ల ద్వారా దిగువకు విడుదల చేస్తున్న వరద నీటిని పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... సీఎం రేవంత్ రెడ్డికి సాగు నీటి ప్రాజెక్టు నిర్వహణ కూడా రాకపోవడం వల్లే ఇవాళ జూరాల ప్రాజెక్టు డేంజర్లో పడిందన్నారు.
ప్రతిఏటా వర్షాకాలంలో వరద వస్తుందని తెలిసినా స్పిల్ వే వద్ద మెయింటెనెన్స్ పనులు చేయించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం గా వ్యవహారిస్తున్న విషయం స్పష్టంగా కనిపిస్తోందన్నారు. జూరాలకు క్రమంగా వరద ఉదృతి పెరుగుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి, మంత్రులు ఇప్పటికైనా మొద్దునిద్ర వీడాలని వారు హితవు పలికారు. జూరాల 9వ నంబర్ గేట్ రోప్ తెగిపోవడంతోపాటు ఇతర గేట్ల రోప్లు బలహీనంగా ఉండడం ప్రాజెక్టును ప్రమాదంలోకి నెట్టిందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే దిగువ ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయడంతోపాటు, ఎగువ నుంచి పెరుగుతున్న ఇన్ ఫ్లో ను ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ పకడ్బందీగా వ్యవహరించాలని, జూరాల ప్రాజెక్టుకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా జాగ్రత్త చర్యలు తీసుకోవాలని వారు సూచించారు. ప్రాజెక్టు సందర్శించిన వారిలో గద్వాల బీఆర్ఎస్ ఇంచార్జీ బాసు హన్మంతునాయుడు, నాయకులు గాజుల పాడు రాఘవేంద్ర రెడ్డి, మోనేష్ ఆత్మకూర్ బీఆర్ఎస్ మండల నాయకులు రవికుమార్ యాదవ్, తదితరులు పాల్గొన్నారు..
డేంజర్ లో జూరాల??
జూరాల ప్రాజెక్టు ఎగువన ఉన్న కర్ణాటక జలాశయాల నుంచి కృష్ణా నదిలోకి భారీగ వరద నీరు వచ్చి చేరుతోంది. గత నాలుగు రోజుల నుంచి జూరాలకు లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహంతో జలాశయం గరిష్ట నీటిమట్టానికి చేరువ కావడంతో, అప్రమత్తమైన ప్రాజెక్టు అధికారులు వరద నీటి మట్టాన్ని నియంత్రించేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. ఇందులో భాగంగా.. ప్రాజెక్టుకు ఉన్న మొత్తం గేట్లలో 12 గేట్లను ఎత్తివేసి, వచ్చిన నీటిని వచ్చినట్లే దిగువకు, శ్రీశైలం జలాశయం వైపు విడుదల చేస్తున్నారు. డ్యాం గేట్ల ద్వారా నీటిని దిగువకు విడుదల చేసే క్రమంలో గురువారం డ్యామ్ 9వ గేట్ రోప్ తెగిపోయిందన్న వార్తలు సోషల్ మీడియాలో రావడంతో తీవ్ర కలకలం రేపింది.
ఈ ఘటనతో పాటు మరో రెండు గేట్ల రోప్స్ బలహీనపడటం స్థానిక ప్రజానీకంలో, ఆయకట్టు రైతులలో భయాందోళనలు సృష్టిస్తోంది. జూరాల ఎగువ నుంచి భారీ వరద ప్రవాహం వస్తుండటంతో ఏ క్షణం ఏ ప్రమాదం జరుగుతుందోన్న భయాందోళనలో స్థానిక, జూరాల ఆయకట్టు ప్రజలు ఉన్నారు. అయితే 9వ గేటు రోప్ తెగడంపై డ్యామ్ అధికారులను సంప్రదించగా అలాంటిది ఏమి లేదని, ప్రాజెక్టుకు ఎలాంటి నష్టం లేదన్నారు.