రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలపై.. సీఎం రేవంత్ రెడ్డి చిట్ చాట్
ఖమ్మం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు ఖమ్మం జిల్లాలోని వరద ప్రాంతాలలో పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా మీడియాతో ముచ్చటించారు. మున్నేరు రిటైనింగ్ వాల్ ఎత్తు పెంపుపై ఇంజనీర్లతో చర్చిస్తామని సీఎం తెలిపారు. 75 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా 42 సెంటీమీటర్ల వర్షం పడటం దురదృష్ట కరమన్నారు. కనీవినీ ఎరుగని వానలు, వరదల కారణంగా జరిగిన నష్టాన్ని పూడ్చడానికి తెలంగాణ ప్రభుత్వం తరపున వరద సాయం చేయాల్సిందిగా కోరుతూ కేంద్రానికి లేఖ రాశామని సీఎం తెలియజేశారు. వరద నష్టాన్ని అంచనా వేస్తూ కేంద్రాన్ని రూ. 2వేల కోట్ల తక్షణ సాయం కోరామన్నారు. కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు స్పందన రాలేదని ఆయన తెలిపారు. కాగా వరదల వల్ల రూ. 5438 కోట్ల నష్టం జరిగిందని ప్రభుత్వ ఇంజనీరింగ్ శాఖ అంచనా వేసిందన్నారు. వరద నష్టం అంచనాను కేంద్రానికి నివేదించాం.. వరద బాధితులకు రూ. 10 వేలు తక్షణ సాయం చెయ్యాలన్నారు.
వరద నష్టం అంచనాను కేంద్రానికి నివేదించామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఈ నివేదిక లో భాగంగా వరద బాధితులకు రూ. 10 వేలు తక్షణ సాయం చెయ్యాలని ఈ విపత్తును జాతీయ విపత్తుగా పరిగణించాలంటూ ప్రధాన మంత్రికి సీఎం విజ్ఞప్తి చేశారు. కనీవినీ ఎరుగని వానలు, వరదల వల్ల తెలంగాణ అతలాకుతలం అయ్యిందనీ రాష్ట్ర ప్రభుత్వం తరఫున చేసిన ముఖ్యమంత్రి చేసిన విజ్ఞప్తిని సానుభూతితో పరిశీలించి తెలంగాణ ప్రజలకు న్యాయం చెయడానికి ప్రధాని సానుకూలంగా స్పందిస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా.. రాష్ట్ర ప్రభుత్వం తరఫున మృతులకు 5 లక్షల సాయం ప్రకటించామన్నారు. ఖమ్మం జిల్లాలోని వరద ప్రాంతాలలో పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా సర్వే ఆఫ్ ఇండియా మ్యాప్స్, శాటిలైట్ చిత్రాలు తదితర సాంకేతిక పరిజ్ఞానంతో ఇంజనీరింగ్ అధికారులు ఖమ్మంలోని ఆయా ప్రాంతాలలోని బఫర్ జోన్ లు, ఎఫ్ టీ ఎల్ తదితర లోతట్టు ప్రాంతాలలో అక్రమంగా నిర్మంచిన నిర్మాణాలను గుర్తించి సదరు ఆక్రమణలు తొలగిస్తామన్నారు.
ప్రభుత్వం ముందు చూపుతో అధికారులను అప్రమత్తం చేయడంతోనే వరద ముప్పు నుంచి ప్రజలకు ప్రాణ నష్టం, ఆస్తి నష్టం తగ్గిందన్నారు. ఈ సందర్భంగా హరీశ్ రావు చేసిన విమర్శలపై సీఎం రేవంత్ ఘాటుగా స్పందించారు. వరదలపై హరీశ్ రావు ఇష్టారీతిన విమర్షలు చేస్తూ వరదలను సైతం రాజకీయం చేయడం దురదృష్ట కరమన్నారు ప్రభుత్వాన్ని విమర్శించే ముందు హరీశ్ రావు తమ హయాంలో బీ ఆర్ ఎస్ నేతలు చేసిన ఆక్రమణల గురించి ఆత్మ విమర్శ చేసుకోవాలన్నారు. ఈ సందర్భంగా బీ ఆర్ఎస్ నేత పువ్వాడ అజయ్ కుమార్ చేసిన ఆక్రమణలపై కూడా హరీశ్ రావు స్పందించాలన్నారు. ఆక్రమించిన స్థలంలో ఏంచక్కా ఆసుపత్రి కట్టారనీ.. సదరు ఆక్రమణలు తొలగించాలని పువ్వాడకు హరీశ్ రావు చెప్పాలని సీఎం అన్నారు.
ఆక్రమణల తొలగింపుపై బీఆర్ ఎస్ నేతలు ఆదర్శంగా నిలవాలి సీ ఎం హితవు పలికారు. ఖమ్మం జిల్లా పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి తో పాటు మంత్రులు కూడా వరద ప్పాంతాలలో పాల్గొని ప్రజలను పరామర్శంచారు. డిప్యూటీ సీఎం భట్టీ విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు, రెవెన్యూ గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, రోడ్లు భవనాల శాఖా మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, సీఎంతో కలిసి జిల్లా పర్యటనలో పాల్గొన్నారు. ఖమ్మం జిల్లా పర్యటన ముగిసిన వెంటనే రోడ్డు మార్గంలో సీఎం రేవంత్ రెడ్డి మహబూబాబాద్ జిల్లా పర్యటనకు బయలుదేరారు.






