30-06-2025 08:55:36 PM
హైదరాబాద్: సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువు మండలం పాశమైలారంలోని సిగాచి కెమికల్ ఫ్యాక్టరీలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. పాశమైలారం పారిశ్రామిక వాడలో జరిగిన ఘోర ప్రమాదంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఈ సంఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపు ఉదయం 10 గంటలకు వెళ్లనున్నారు. అగ్నిప్రమాదం జరిగిన పరిశ్రమను ముఖ్యమంత్రి పరిశీలించనున్నారు. పరిశ్రమ వద్ద సహాయకచర్యల గురించి ఎప్పటికప్పుడు మంతులు, అధికారులను అడిగి తెలుసుకుంటున్నారు.
మృతుల కుటుంబాలను ఆదుకునేందుకు చర్యలు చేపట్టాలని, గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను రేవంత్ రెడ్డి ఆదేశించారు. పాశమైలారం ప్రమాదం విషయంలో సీఎస్ రామకృష్ణారావు నేతృత్వంలో ప్రభుత్వ సహాయక చర్యల పర్యవేక్షణ కమిటీ ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ పర్యవేక్షణ కమిటీలో డీఆర్ఎఫ్ స్పెషల్ సీఎస్, కార్మికశాఖ సీఎస్, హెల్త్ సెక్రెటరీ, ఫైర్ సర్వీసెస్ అడిషనల్ డీజీలు సభ్యులుగా నియమితులయ్యారు. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా చేపట్టాల్సిన, ప్రమాదాల నివారణ చర్యలను సిఫారసు చేసే బాధ్యతను కమిటీకి అప్పగించింది.