అబద్ధాల్లో సీఎం రేవంత్ గోబెల్స్ను మించుతున్నారు
- బొగ్గు గనుల వేలంలో మంత్రులు పాల్గొనటం సిగ్గుచేటు
- మాజీ మంత్రి కేటీఆర్
హైదరాబాద్, జూన్ 22 (విజయక్రాంతి): పచ్చి అబద్ధాలు ప్రచారం చేయడంలో సీఎం రేవంత్రెడ్డి గోబెల్స్ను మించిపోతున్నారని, వాటిని విని గోబెల్స్ సైతం సమాధిలో తలదించుకుంటున్నాడని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శనివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ మిలాఖత్ అయి రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నాయన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం బొగ్గు గనుల వేలాన్ని వ్యతిరేకించిందన్నారు. అందుకే తమ ప్రభుత్వం ఏనాడూ వేలంలో పాల్గొనలేదని గుర్తుచేశారు. కానీ నేటి ప్రభుత్వం నిస్సిగ్గుగా పాల్గొంటున్నదని మండిపడ్డారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం గనులను కంపెనీలకు కేటాయించినా, తమ ప్రభుత్వ నిబద్ధతను చూసి ఆయా కంపెనీలు బొగ్గు తవ్వలేకపోయాయన్నారు. ఆ రెండు కంపెనీలు మహారాష్ట్రలో కాంగ్రెస్, శివసేన ఉమ్మడి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు టాక్లీ, జెనా, బెల్లోరా గనులను దక్కించుకున్న విషయం మరచిపోవద్దన్నారు.






