05-10-2025 12:43:56 AM
భోపాల్, అక్టోబర్ 4: మధ్యప్రదేశ్లోని చింద్వాడలో ‘కోల్డ్రిఫ్’ సిరప్ వినియోగించిన తొమ్మిది మంది చిన్నారులు మృతి చెందగా, అక్కడి ప్రభుత్వం అప్రమత్తమైంది. సిరప్ నమూనాలను ల్యాబ్కు పంపించి, దానిలో రసాయన అవశేషాలు ఉన్నాయని తేల్చింది. శుక్రవారం రాత్రి సిరప్పై సంపూర్ణ నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించింది. మెడికల్ షాపుల్లో ఇప్పటికే స్టాక్ ఉన్న ‘కోల్డ్రిఫ్’ సిరప్లు సైతం విక్రయించొద్దని ఉత్తర్వులు జారీ చేసింది.
తమిళనాడులోని కాంచీపురం శ్రేసాన్ ఫార్మాసూటికల్ కంపెనీలో తయారైన ఈ దగ్గుమందుకు దేశవ్యాప్తంగా డి మాండ్ ఉంది. అయితే.. మధ్యప్రదేశ్లోని చింద్వాడకు చెందిన 9 మంది చిన్నారులు మృతిచెందడంతో, ఆ సిరప్ ప్రమాదకరమనే విషయం ప్రపంచానికి తెలిసింది. సిరప్లో కంపెనీ 48.6 శాతం మేరకు డై ఇథిలీన్ గ్లుకాల్ వినియోగిస్తున్నట్లు తెలిసింది. ఈ డ్రగ్ కిడ్నీ సహా కాలేయం క్షీణతకు కారణమవుతుందని నిపుణులు వెల్లడిస్తున్నారు.
ఈ నేపథ్యంలో చిన్నారుల మృతికి కారణమైన ఫార్మాస్యూటికల్ కంపెనీపై చర్యలు తీసుకోవాలని తమిళనాడు ప్రభుత్వాన్ని మధ్య ప్రదేశ్ ప్రభుత్వం కోరింది. దీంతో తమిళనాడు ప్రభుత్వం స్పందించింది. సదరు కం పెనీపై చర్యలకు పూనుకుంది. సిరప్పై వినియోగంపై ఈ నెల 1న నిషేధం విధించింది.
ఈ విషయమై మధ్యప్రదేశ్ డ్రగ్ కంట్రోలర్ అధికారి ఒకరు మాట్లాడుతూ.. ‘సిరప్ తయారీలో ఫార్మాస్యూటికల్ కంపెనీ సరైన ప్రమాణాలు పాటించలేదు. సిరప్ కారణంగా మహారాష్ట్రలో ఇద్దరు, రాజస్థాన్ లోనూ మరొకరు మృతిచెందారు’ అని పేర్కొన్నారు. కాగా, సిరప్ను ఇప్పటికే తమిళ నాడు ప్రభుత్వం నిషేధించగా, శనివారం కేరళ ప్రభుత్వం కూడా నిషేధించింది.
డీజీహెచ్ఎస్ సూచనలు
కోల్డ్రిఫ్ సిరప్ వినియోగించి మధ్యప్రదేశ్లో తొమ్మిది మంది, మహారాష్ట్రలో ఇద్దరు, రాజస్థాన్లో ఒకరు మృతి ఘటనల నేపథ్యంలో డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీ సెస్ నుంచి కీలక ప్రకటన వెలువడింది.
రెండేళ్లలోపు చిన్నారులు దగ్గు, జలుబు బారిన పడితే సిరప్ సిఫార్సు చేయరాదని, రెండేళ్లకు పైగా వయసున్న పిల్లలకు వైద్యుల సూచన మేరకు సరైన మోతాదులో సిరప్ వినియోగించాలని సూచించింది. దగ్గు, జలుబు పిల్లల్లో సహజమని, కొద్దిరోజులుండి అవి వాటంతట అవే తగ్గిపోతాయని పేర్కొంది.