14-09-2025 05:06:18 PM
మహబూబాబాద్,(విజయక్రాంతి): యూరియా పంపిణీ కార్యక్రమాన్ని ప్రణాళిక ప్రకారం, రైతు భరోసా డేటా ఆధారంగా పిఓఎస్ మిషన్, రిజిస్టర్లో నమోదు చేసి ప్రతి రైతుకు యూరియా పంపిణీ చేయాలని మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ ఆదేశించారు. ఆదివారం మహబూబాబాద్, కేసముద్రం మండలాలలో విస్తృతంగా పర్యటించారు. కంబాలపల్లి యూరియా పంపిణీ కేంద్రాన్ని సందర్శించి సరఫరా చేస్తున్న ప్రక్రియను పరిశీలించారు.
యూరియా పంపిణీలో రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని సౌకర్యాలు కల్పించామని, మండల స్థాయి యూరియా కోఆర్డినేషన్ కమిటీల మీటింగ్ ల ద్వారా నిత్యం యూరియా పంపిణి పై ముందస్తుగా అదనపు కలెక్టర్, రెవెన్యూ డివిజనల్ అధికారులు, మండల ప్రత్యేక అధికారులు, వ్యవసాయ సహకార, అన్ని విభాగాల సిబ్బంది క్షేత్రస్థాయిలో విధులలో ఉన్నారని తెలిపారు. కేసముద్రం పట్టణ పరిధిలోని అమీనాపురం మహాత్మ జ్యోతిరావు పూలే బాలికల వసతి గృహాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. హాస్టల్లోని డైనింగ్ హాల్, స్టోర్ గది, కిచెన్ షెడ్, పరిసరాలను పరిశీలించారు.
విద్యార్థులకు నూతన డైట్ మెనూ ప్రకారం బ్రేక్ ఫాస్ట్, లంచ్, డిన్నర్ అమలు చేయాలని, షెడ్యూల్ ప్రకారం వైద్య పరీక్షలు, ప్రతి సబ్జెక్టు పై అవగాహన డిజిటల్ తరగతులు, క్రీడా సాంస్కృతిక విభాగాలలో శిక్షణ ఇవ్వాలన్నారు. కలెక్టర్ వెంట జిల్లా వ్యవసాయ శాఖ అధికారిని విజయనిర్మల, డిఆర్డిఓ ప్రాజెక్ట్ డైరెక్టర్ మధుసూదన్ రాజు, తహసిల్దార్ రాజేశ్వరరావు, ఎంపీడీవో క్రాంతి , ఏవో వెంకన్న తదితరులున్నారు.