ఇంటర్ పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసిన కలెక్టర్
మేడ్చల్, ఫిబ్రవరి 25 (విజయక్రాంతి): శామీర్ పేట్ మండలంలోని తూంకుంటలోని సాయితేజ జూనియర్ అండ్ డిగ్రీ కాలేజీ, ఉప్పర్ పల్లిలోని ఎక్సెలెన్సియా జూనియర్ కాలేజీలలో ఇంటర్మీడియెట్ పరీక్ష కేంద్రాలను కలెక్టర్ మను చౌదరి తనిఖీ చేశారు.
పరీక్షలు పూర్తయ్యే వరకు సిబ్బంది అప్రమత్తంగా ఉంటూ పరీక్షలు సజావుగా నిర్వహించేలా చూడాలని కలెక్టరు సూచించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పరీక్షలు జరుగుతున్న తరగతి గదులలో తిరిగి విద్యార్థులు పరీక్ష వ్రాయడాన్ని పరిశీలించారు.
విద్యార్థులకు అవసరమైన మంచినీరు, లైట్లు, ఫ్యాన్లు, మెడికల్ సౌకర్యాలు ఉన్నాయా అని జిల్లా ఇంటర్మిడియెట్ అధికారిని అడిగి తెలుసుకున్నారు. పరీక్షా కేంద్రంలో మొత్తం ఎంత మంది పరీక్ష వ్రాసే విద్యార్థులు ఉన్నారని, అందులో గైరుహాజరు ఎంతమంది అని అడిగి తెలుసుకున్నారు.
సిసి కెమెరాలు పని చేస్తున్నాయా అని పరిశీలించి, సిసి కెమెరాల డిస్ ప్లే రూం నుండి ప్రతి పరీక్ష గదిని పరిశీలించారు. పరీక్షా పత్రాలను ఏ సమాయానికి ఓపెన్ చేసారని, పరీక్షలకు నిర్ణీత సమయానికన్నా ఐదు నిమిషాల తర్వాత కూడా పరీక్ష కేంద్రాలకు విద్యార్థులను అనుమతించారా అని కాలేజీ యాజమాన్యాన్ని అడిగి తెలుసుకున్నారు. ఈ పర్యటనలో జిల్లా ఇంటర్మీడియెట్ అధికారి కిషన్, శామీర్ పేట్ మండల తహాసీల్దారు సుచరిత, తదితరులు పాల్గొన్నారు.




