calender_icon.png 29 October, 2025 | 8:26 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సదరం క్యాంపును పరిశీలించిన కలెక్టర్ జితేష్ వి.పాటిల్

29-10-2025 01:10:15 AM

భద్రాద్రి కొత్తగూడెం, అక్టోబర్ 28, (విజయక్రాంతి):కొత్తగూడెం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో నిర్వహిస్తున్న దివ్యాంగుల వైకల్యం నిర్ధారణ సదరం క్యాంపును జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన క్యాంపులో దివ్యాంగుల వైద్య పరీక్షలు, ఆన్లైన్ దరఖాస్తుల ఎంట్రీ విధానాన్ని ప్రత్యక్షంగా పరిశీలించారు. దివ్యాంగులు ఆసుపత్రికి వచ్చిన క్రమంలో వారు ఎదుర్కొంటున్న సమస్యలను, సేవల లభ్యతను, నిర్ధారణకు ఉపయోగిస్తున్న పరికరాల పనితీరును కలెక్టర్ సమీక్షించారు.కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం దివ్యాంగుల సంక్షేమాన్ని అత్యంత ప్రాధాన్యంగా తీసుకుంటుందని, ప్రతి దివ్యాంగుడికి అవసరమైన గుర్తింపు సర్టిఫికేషన్ అందేలా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.

ప్రభుత్వం అందిస్తున్న యూనిక్ డిసెబిలిటీ ఐడెంటిటీ కార్డులు తెలంగాణ రాష్ట్రంతోపాటు దేశంలోని అన్ని రాష్ట్రాల్లో కూడా గుర్తింపు పొందుతాయని ఆయన తెలిపారు. ఈ కార్డుల ద్వారా దివ్యాంగులు ఆరోగ్య, విద్య, ఉపాధి, రవాణా వంటి రంగాలలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను సులభంగా పొందగలరని పేర్కొన్నారు. ప్రతి దివ్యాంగుడు సమాజంలో సమాన హక్కులు, అవకాశాలు పొందేలా ప్రభుత్వ యంత్రాంగం సత్వర చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యా చందన, వైద్య నిపుణులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

రైతు సంక్షేమానికి కృషి విజ్ఞాన కేంద్రాల పాత్ర కీలకం: కలెక్టర్ జితేష్ వి. పాటిల్

కొత్తగూడెం, అక్టోబర్ 28, (విజయక్రాంతి):రైతు సంక్షేమానికి కృషి విజ్ఞాన కేంద్రాల పాత్ర కీలకం అని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ అన్నారు. మంగళవారం కొత్తగూడెం లోని కృషి వి జ్ఞాన కేంద్రం ను సందర్శించారు. ఈ సందర్శనలో భాగంగా ఆయన కేంద్రంలో చేపడుతున్న నూతన వ్యవసాయ సాంకేతిక పద్ధతులు, భూసార పరీక్షా కేంద్రం కార్యకలాపాలు, సమగ్ర వ్యవసాయ నమూనా యూనిట్లను సమీక్షించారు. కేంద్రంలోని పరిశోధన, శిక్షణా కార్యక్రమాలు, రైతు అవగాహన కార్యక్రమాలపై శాస్త్రవేత్తలతో చర్చించి, రైతు సంక్షేమానికి కృషి విజ్ఞాన కేంద్రం అందిస్తున్న సేవలను ఆయన ప్రశంసించారు.

ఈ సందర్భంగా కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ డాక్టర్ టి. భరత్ జిల్లా వ్యాప్తంగా రైతులకు అందిస్తున్న సాంకేతిక మార్గదర్శకత, పంటల విస్తరణ కార్యక్రమాలు, వివిధ ప్రభుత్వ పథకాల అనుసంధానం, శిక్షణా కార్యక్రమాలపై కలెక్టర్ కి సమగ్రంగా వివరించారు.అనంతరం గిరిజన ఉపాధి పథకం కింద కృషి విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శిక్షణా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ఇల్లందు మండలంలోని పోపెల్లి గ్రామానికి చెందిన రైతులతో ముచ్చటించి, పట్టుపురుగుల పెంపకం, విప్పపువ్వు సాగు, సమగ్ర వ్యవసాయం పద్ధతులు వంటి ఆధునిక వ్యవసాయ విధానాలపై వారికి అవగాహన కల్పించారు.

రైతులు ఆధునిక పద్ధతులను అవలంబిస్తే పంటల దిగుబడి పెరుగుతుందని, ఆదాయం కూడా పెరుగుతుందని కలెక్టర్ సూచించారు.ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ..కృషి విజ్ఞాన కేంద్రాలు గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. రైతులకు శాస్త్రీయ అవగాహన, సాంకేతిక సహాయం, మరియు సమగ్ర వ్యవసాయ పద్ధతుల ప్రచారం ద్వారా రైతు ఆదాయాన్ని పెంచడంలో ఈ కేంద్రాల పాత్ర అత్యంత ప్రాముఖ్యమైనది అని పేర్కొన్నారు. అనంతరం కలెక్టర్ చేతులమీదుగా గిరిజన రైతులకు తార్పాలిన్లు వ్యవసాయ ఉపయోగ సామగ్రిని అందజేశారు. ఈ కార్యక్రమం లో శాస్త్రవేతలు డాక్టర్. హేమ శరత్ చంద్ర, బి. శివ, రైతులు సంబధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.