18-07-2025 11:55:28 PM
ఆశ్రమ పాఠశాలల తనిఖీ
జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
బెల్లంపల్లి అర్బన్,(విజయక్రాంతి): బెల్లంపల్లి ప్రభుత్వ ఆశ్రమ పాఠశాలలలో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పూర్తి స్థాయిలో సౌకర్యాలు కల్పించి నాణ్యమైన విద్యను అందించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శుక్రవారం జిల్లాలోని బెల్లంపల్లి మండల కేంద్రంలోని కస్తూరిభా గాంధీ బాలికల విద్యాలయం, తెలంగాణ ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాల, బాలుర జూనియర్ కళాశాల (ఇ/మీ) లను మండల పరిషత్ అభివృద్ధి అధికారి మహేందర్, జాడి పోచయ్య లతో కలిసి తనిఖీ చేశారు. విద్యార్థులకు అందిస్తున్న ఆహారం నాణ్యత, త్రాగునీరు, వంటశాల, భోజనశాల, వసతి గృహంలో వసతులు, పడకలు, మూత్రశాలలు, గదులను పరిశీలించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ మాట్లాడుతూ ప్రభుత్వం అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీ ఆధ్వర్యంలో అన్ని ప్రభుత్వ పాఠశాలలలో విద్యార్థులకు సకల సౌకర్యాలను కల్పించడం జరిగిందని తెలిపారు. ప్రతి పాఠశాలలో త్రాగునీరు, విద్యుత్, మూత్రశాలలు, ప్రహారీగోడ, వంటశాల ఇతర అన్ని మౌళిక సదుపాయాలు కల్పించడం జరుగుతుందన్నారు.మెనూ ప్రకారం విద్యార్థులకు సకాలంలో పౌష్టికాహారాన్ని అందించాలని, ఆహారం తయారీ సమయంలో నిబంధనలు పాటించాలని, తాజా కూరగాయలు, నాణ్యమైన నిత్యవసర సరుకులను వినియోగించాలని, శుద్ధమైన త్రాగునీటిని అందించాలని ఆదేశించారు. విద్యార్థుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని, వర్షాకాలం కావడంతో పాఠశాలలో పారిశుద్ధ్య నిర్వహణ పకడ్బంధీగా చేపట్టాలని తెలిపారు.
పాఠశాలలో విద్యార్థుల సంఖ్యను పెంపొందించాలని, బడి బయట పిల్లలు, మధ్య బడి మానివేసిన పిల్లలను గుర్తించి వారి తల్లిదండ్రులతో మాట్లాడి తిరిగి పాఠశాలకు వచ్చే విధంగా ఉపాధ్యాయులు కృషి చేయాలని తెలిపారు. 6, 7 తరగతుల విద్యార్థులతో మాట్లాడి వారి పఠనా సామర్థ్యాలను పరిశీలించారు. పాఠశాలలో కల్పిస్తున్న సౌకర్యాలు, అందిస్తున్న పోషక ఆహారంపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. నూతనంగా నిర్మిస్తున్న భవన నిర్మాణ పనులను వేగవంతం చేసి త్వరగా పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో నాణ్యమైన విద్యాబోధన అందించాలని, విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సత్వరమే పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలని తెలిపారు.
అభివృద్ధి పనుల తనిఖీ
అమృత్ 2.0 పథకంలో భాగంగా కొనసాగుతున్న నీటి ట్యాంక్ నిర్మాణ పనులను పరిశీలించి త్వరగా పూర్తి చేయాలని తెలిపారు. మిషన్ భగీరథతో పాటు అమృత్ 2.0 పథకం క్రింద నివాసాలకు త్రాగునీరు అందించే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. జిల్లా కలెక్టర్ మున్సిపల్ కార్యాలయాన్ని సందర్శించి మున్సిపల్ పరిధిలో కొనసాగుతున్న అభివృద్ధి పనుల పురోగతిని పరిశీలించారు.