27-10-2025 06:57:15 PM
67 మద్యం షాపులకు డ్రా తీసిన జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్
హనుమకొండ,(విజయక్రాంతి): హనుమకొండ జిల్లా పరిధిలోని 67 మద్యం షాపులకు లాటరీ డ్రా ను సోమవారం హనుమకొండలోని అంబేద్కర్ భవన్ లో నిర్వహించారు. హన్మకొండ ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ అధికారులు మద్యం షాపుల కేటాయింపునకు సంబంధించి లాటరీ డ్రాను తీసేందుకు ఏర్పాట్లు చేయగా హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ హాజరై డ్రా తీశారు. జిల్లావ్యాప్తంగా మొత్తం 67 మద్యం షాపులకు గాను 3175 దరఖాస్తులు రాగా లాటరీ పద్ధతిన డ్రాను తీశారు. ఒక్కో మద్యం దుకాణానికి సంబంధించి దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల సమక్షంలో జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ డ్రా తీసి సంబంధిత నెంబర్ ను ప్రకటించారు.
ఈసారి కొన్ని షాపులు కొత్త అభ్యర్థులకు రాగా, కడిపికొండ ప్రాంతానికి సంబంధించి 58 నంబర్ గల షాప్ కు అత్యధికంగా 116 అప్లికేషన్లు రాగా పాత షాపు వారికే ప్రస్తుతం కూడా లాటరీ దక్కడం గమనార్హం. మద్యం షాపుల కేటాయింపునకు సంబంధించి లాటరీ పద్ధతిన డ్రా లో కేటాయించబడిన అభ్యర్థికి కేటాయింపు పత్రం ఎక్సైజ్ అధికారులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ డిప్యూటీ కమిషనర్ అంజన్ రావు, సూపరింటెండెంట్ చంద్రశేఖర్,ఎక్సైజ్ శాఖ సిఐలు,ఎస్ఐలు, సిబ్బంది పాల్గొన్నారు.