05-06-2025 12:14:45 AM
జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి
నల్లగొండ టౌన్, జూన్ 4 : దివ్యాంగులు, మానసిక వికలత్వంతో బాధపడే చిన్నారులు, రక్తహీనత ,ఇతర నరాల వ్యాధులతో బాధపడేవారికి చికిత్స ద్వారా సహాయం చేసేందుకు ముందుకు రావాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఈసీఐఎల్ చీఫ్ మెడికల్ ఆఫీసర్లను కోరారు. బుధవారం నల్గొండ లోని కలెక్టరేట్లోని తన ఛాంబర్ లో ఈసీఐఎల్ కి చెందిన చీఫ్ మెడికల్ ఆఫీసర్ వేణుబాబు, హెచ్ ఆర్ మేనేజర్ దుర్గా ప్రసాద లతో సమావేశ నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలో సుమారు 52 వేల మంది విభిన్న సామర్ధ్యాలు కలిగిన వారు ఉన్నారని తెలిపారు. ఫ్లోరైడ్ వ్యాధికి గురైన వారితో పాటు, మానసిక వికలత్వం, నరాల బలహీనత ఉన్న 700 మంది చిన్నారులు మానసిక వికలత్వంతో బాధపడుతున్న కదలలేని పరిస్థితిలో మంచానికే పరిమితమైన వారున్నారని తెలిపారు.
దివ్యాంగులకు బ్యాటరీ ఆపరేటెడ్ సైకిళ్ల తో పాటు, సీటీ స్కాన్, ఎంఆర్ స్కానింగ్ యంత్రాలు,అవసరమైన ఐ ఈ సి మెటీరియల్, చికిత్సకు సంబంధించిన సహాయాన్ని చేయాలని కోరారు. మెడికల్ చీఫ్ ఆఫీసర్ వేణుబాబు స్పందిస్తూ సామాజిక బాధ్యత కింద దివ్యాంగులకు బ్యాటరీ ఆపరేటెడ్ మోటార్ సైకిళ్ళు, కృత్రిమ అవయవాలు, వినికిడి యంత్రాలు, మూడు చక్రాల సైకీళ్ల వంటివి తాము పంపిణీ చేస్తున్నామని తెలిపారు.
నల్గొండ జిల్లాకు 100 బ్యాటరీ ఆపరేటెడ్ ట్రై సైకిల్స్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు జిల్లా కలెక్టర్ కు వివరించారు. ఈ సమావేశంలో సిడిపిఓ హరిత, జిల్లా సంక్షేమ శాఖ కార్యాలయం ప్రోగ్రాం అధికారి నాగిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.