14-06-2025 12:57:54 AM
హైదరాబాద్, సిటీ బ్యూరో జూన్ 13 (విజయక్రాంతి): ఫార్ము లా- ఈ-రేస్ కేసు లో అవినీతి నిరోధకశాఖ (ఏసీబీ) శుక్రవారం మరోసారి బీఆర్ఎస్ వర్కిం గ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్కు నోటీసులు జారీ చేసింది. జూన్ 16వ తేదీ ఉదయం 10 గంటలకు విచారణ కు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నది. దీంతో ఈఫార్ములా కేసులో మళ్లీ కదలిక వచ్చినట్లయింది.
కేసులో ఏ1 నిందితుడు అప్పటి మున్సిపల్శాఖ మంత్రి కేటీఆర్ కాగా, ఏ2 ఐఏఎస్ అరవింద కుమార్, ఏ3 నాటి హెచ్ఎండీఏ చీఫ్ ఇంజినీర్ బీఎల్ఎన్ రెడ్డి. ఏసీబీ ఇప్పటికే ముగ్గురిని విడి విడిగా విచారించింది. తొలి విచారణ పూర్తయి మూడు నెలలు గడుస్తున్నది. కేటీఆర్కు నోటీసుల జారీతో మరోసారి ఫార్ములా ఈ-రేసు కేసు తెరమీదకు వచ్చింది. మరోవైపు ఏసీబీ నోటీసులపై కేటీఆర్ తీవ్రంగా స్పందించారు.
‘రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే సీఎం నాపై అక్రమంగా కేసులు బనాయించారు. నేను చట్టాన్ని గౌరవించే పౌరుడిని. కాబట్టి, ఏసీబీ అధికారులకు పూర్తి సహకారం అందిస్తా. ఈ-రేసు కేసులో డబ్బు లావాదేవీల గోల్మాల్ జరిగిందని అంటున్నారు. ఈ వ్యవహారంలో ఎలాంటి అవకతవకలు జరగలేదు. నిర్వహణ కోసం ఈ-రేస్ నిర్వహణ సంస్థ ఖాతాలో తమ ప్రభుత్వం జమ చేసిన రూ.44 కోట్లు, ఇప్పటికీ అదే ఖాతాలో ఉన్నాయి. సీఎం ప్రభుత్వాన్ని నడపలేకపోతున్నారు.
ప్రజలను ఆ విషయం నుంచి మళ్లించేందుకే సీఎం నాటకాలాడుతున్నారు. సీఎం, నేను ఏసీబీ విచారణను ఎదుర్కొంటున్నాం. ఈ-రేసు కేసులో నేను మీడియా మాధ్యమాలు, న్యాయమూర్తుల సమక్షంలో లైడిటెక్టర్ పరీక్షలకు సిద్ధం. సీఎం రేవంత్రెడ్డి గారు మీరు లైడిటెక్టర్ పరీక్షలకు సిద్ధమా?’ అంటూ సవాల్ విసిరారు. రాష్ట్రం దివాళా తీసిందని సీఎం అనేక సభల్లో ఉద్ఘాటించారని, విచారణలు, ప్రచారంపేరుతో ప్రజాధనాన్ని ఎందుకు వృథా చేస్తున్నారని సీఎంను కేటీఆర్ ప్రశ్నించారు.