calender_icon.png 14 June, 2025 | 5:29 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 3.64% డీఏ పెంపు

14-06-2025 01:00:20 AM

2023 జనవరి 1 నుంచి అమలు

  1. జూన్ జీతంలో కలిపి చెల్లింపు 
  2. రెండో డీఏ ఆరు నెలల్లో విడుదల

హైదరాబాద్, జూన్ 13 (విజయక్రాంతి): ఉద్యోగులకు తెలంగాణ సర్కా ర్ శుభవార్త చెప్పింది. ఇటీవల క్యాబినెట్ సమావేశంలో ఉద్యోగులకు ఇప్పుడు ఓ డీఏను, ఆరునెలల్లో మరో డీఏను ఇవ్వాలని నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈమేరకు ఉద్యోగులకు 3.64 శాతం డీఏ పెం చుతూ ప్రభుత్వం శుక్రవారం జీవో జారీ చేసిం ది. పెంచిన డీఏ 2023, జనవరి 1 నుంచి వర్తిస్తోందని ఉత్తర్వుల్లో పేర్కొంది.

పెరిగిన డీఏను జూలై 1న చెల్లించే జూన్ జీతంలో కలిపి చెల్లించనున్నారు. 2023, జనవరి 1 నుంచి ఈనెల వరకు డీఏ బకాయిలు జీపీఎఫ్ ఖాతాలో జమచేస్తారు. సీపీఎస్ ఉద్యోగులకు 2025, జూలై నుంచి 28 వాయిదాల్లో చెల్లిస్తారు. పెండింగ్‌లో ఉన్న ఐదు డీఏలను విడుదల చేయాలని ఉద్యోగ, ఉపాధ్యాయులు ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నారు.

కానీ రాష్ట్ర అప్పులు, వడ్డీల చెల్లింపులు, సంక్షేమ పథకాలు, ఉద్యోగుల జీతాలకు ప్రతినెల దాదాపు రూ.22 వేల కోట్లు అవసరమవుతోంది. కానీ, ప్రతినెలా రూ.18,500 కోట్ల వరకు మాత్రమే ఆదాయం వస్తోంది. దీంతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ఉద్యోగులు అర్థం చేసుకోవాలని పలు వేదికలపై సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే. 

ప్రతినెలా 200 కోట్ల భారం..

ప్రభుత్వం ప్రకటించిన ఒక డీఏ చెల్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతినెలా సుమారు రూ.200 కోట్లకుపైగా ఖర్చు అవుతోంది. ఏడాదికి దాదాపు రూ.2,400 కోట్లు సర్కార్‌పై అదనపు భారం పడుతోందని అంచనా. పెండింగ్ బిల్లులతోపాటు డీఏలను విడుదల చేయాలని ప్రభుత్వంపై ఏ డాదిన్నరగా ఉద్యోగ సంఘాల నా యకులు ఒత్తిడి తీసుకొస్తున్నారు.

ఈక్రమంలోనే ఓ వైపు పెద్దఎత్తున అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు నిధుల కొరత రాకుండా చూస్తూనే మరోవైపు ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈక్రమంలోనే ఈనెలలో జరిగిన క్యాబినెట్ భేటీలో పలు నిర్ణయాలు తీసుకున్నారు.

ఉద్యోగుల ఆరోగ్య పథకానికి ట్రస్ట్, ప్రతినెలా పెండింగ్ బిల్లులు రూ.700 కోట్లు విడుదల చేయడం, జాయింట్ స్టాఫ్ కౌన్సిల్‌ను ఏర్పాటు చేయాలని, ఉద్యోగ సంఘాలకు గుర్తింపు ఇవ్వాలని నిర్ణయించారు. సచివాల యంలో ఉద్యోగుల కోటా 12.5 శాతం ఉండేలా క్యాబినెట్ ఆమోదం తెలిపింది.