22-06-2025 04:21:38 PM
పట్టణ సిఐ శశిధర్ రెడ్డి...
మందమర్రి (విజయక్రాంతి): పట్టణంలో శాంతిభద్రతలను సంరక్షించి, నేరాలను అదుపు చేసేందుకే కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం చేపట్టడం జరుగుతుందని పట్టిన సీఐ శశిధర్ రెడ్డి(CI Shashidhar Reddy) స్పష్టం చేశారు. పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర టెంపుల్ ఏరియాలో ఆదివారం తెల్లవారుజామున కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం చేపట్టి కాలనీలో అనుమానిత ప్రాంతాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఏరియాకు కొత్తగా వచ్చిన వ్యక్తుల వివరాలను సేకరించడంతో పాటు, సరైన ధ్రువపత్రాలు లేని 27 ద్విచక్ర వాహనాలను, 4 ఆటోలు సీజ్ చేశారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ... ప్రజల భాగస్వామ్యంతోనే సంపూర్ణ నేర నిర్మూలన సాధ్యమని అన్నారు.
కాలనీలో అపరిచితులు, నేర చరిత్ర కలిగిన వారు ఆశ్రయం పొందుతున్నట్లు అనుమానం వస్తే వెంటనే పోలీసులకు రహస్యంగా సమాచారం అందించాలని కోరారు. యువత గంజాయి, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలకు బానిసలై బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని సూచించారు. చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. యాంటీ-డ్రగ్ అవేర్నెస్ వారోత్సవాల్లో భాగంగా, మత్తుపదార్థాల వల్ల కలిగే దుష్ప్రభావాలు, చట్టపరమైన చర్యల గురించి ప్రజలకు ఈ సందర్భంగా అవగాహన కల్పించారు. కాలనీలలో స్వీయ రక్షణ కోసం సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని, దీనికి పోలీసుల సంపూర్ణ సహకారం ఉంటుందని ఆయన భరోసా ఇచ్చారు.
వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించి, డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలని సూచించారు. తనిఖీల్లో బాగంగా అందిన సమాచారంతో ఒక మహిళ ఇంటిపై దాడి చేసి, అమ్మకానికి సిద్ధంగా ఉన్న 8 లీటర్ల ప్రభుత్వ నిషేధిత గుడుంబాను స్వాధీనం చేసుకొని సదరు మహిళ పై కేసు నమోదు చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ ఎస్సై రాజశేఖర్, అదనపు ఎస్సై శ్రీనివాస్, రామకృష్ణాపూర్ అదనపు ఎస్సై లలిత, పోలీస్ సిబ్బంది, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.