calender_icon.png 22 June, 2025 | 10:14 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మండుతున్న ఎండలు-తలలు వాలుస్తున్న పత్తి మొలకలు

22-06-2025 04:17:58 PM

ముఖం చాటేసిన వరుణుడు..

ఊరించి ఉసురుమనిపించిన వానలు..

లక్షల రూపాయలు నష్టపోతున్న రైతులు..

వలిగొండ (విజయక్రాంతి): గత వారం రోజులుగా ఎండలు మండిపోతుండడంతో రైతులు విత్తిన పత్తి మొలకలు ఎండకు ఎండి తలలు వాలుస్తున్నాయి. గత 20 రోజుల క్రితం ముందుగా కురిసిన వర్షాలు రైతులను ఊరించి ఉసురుమనిపించాయి. రైతులు ఈసారి వర్షాలు ముందుగా వచ్చాయని సంబరపడి సాగుకు సిద్ధమై దుక్కులలలో లక్షల రూపాయలు వెచ్చించి పత్తి విత్తనాలను రైతులు నాటుకున్నారు. అయితే విత్తనం మొలకెత్తిన తర్వాత వరుడు ముఖం చాటేయడంతో వాన జాడలేక పోవడంతో మొలకెత్తిన మొక్కలు ఆకాశం వైపు ఆశగా చూస్తూ ఎండను భరించలేక తలలు వాలుస్తూ ఇక మాకు జీవం పోతుందని విధంగా పత్తి మొక్కలు కనిపిస్తున్నాయి.

దీంతో రైతులు మురిపించిన వర్షాలు ముఖం చాటేయడంతో  దిక్కుతోచని పరిస్థితులు పడిపోయి తలను వాలుస్తున్న మొక్కలను బతికించుకోలేక దిగాలుగా చూస్తున్నారు. ఇక తాము కూడా విత్తనాల కోసం చేసిన అప్పులు మిగిలి తలలు దించుకోవలసిన పరిస్థితి వస్తుందని రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే వేలాది రూపాయలు వెచ్చించి పత్తి విత్తనాలు కొనుగోలు చేసి నాటుకున్నామని వర్షాలు లేకపోవడంతో మొలకలు ఎండిపోతున్నాయని మరోసారి విత్తనాలు విత్తుకోవలసిన పరిస్థితి ఏర్పడుతుందని తమపై ఆర్థిక భారం పెరుగుతుందని రైతులు ఆవేదన చెందుతున్నారు. అదేవిధంగా విత్తనాలు, ఎరువులు దుకాణ యజమానులు కూడా వర్షాలు లేక కొనుగోలు లేకపోవడంతో లక్షల రూపాయల పెట్టుబడుల వడ్డీ కట్టలేక ఇబ్బంది ఏర్పడుతుందని వాపోతున్నారు. పరిస్థితి ఇదేవిధంగా ఉంటే పత్తి రైతులు ఆర్థికంగా చిత్తు కావడం తప్పదని పలువురు రైతులు తెలియజేస్తున్నారు.