సీఎం రేవంత్‌రెడ్డిపై ఫిర్యాదు

06-05-2024 02:17:47 AM

బీజేపీకి పరువు నష్టం కలిగేలా వ్యాఖ్యలు 

కొత్తగూడెం పోలీసులకు బీజేపీ నేతల ఫిర్యాదు

హైదరాబాద్, మే 5 (విజయక్రాంతి) : శనివారం కొత్తగూడెంలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో బీజేపీపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఆ పార్టీ నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు పరువు నష్టం కలిగించేలా, అభ్యంతరకరంగా ఉన్నాయని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి కొత్తగూడెం పోలీసులకు ఫిర్యాదు చేశారు.

 రాజ్యాంగాన్ని మార్చేందుకే బీజేపీ 400 సీట్లు అడుగుతోందని అనడంతో పాటు అధికారంలోకి వచ్చిన వెంటనే రాజ్యాంగాన్ని మారుస్తామని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి దుష్యంత్ కుమార్ వ్యాఖ్యానించినట్లుగా రేవంత్ రెడ్డి తప్పుడు ప్రచారం చేస్తున్నాడని తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. బీజేపీకి ఓటు వేస్తే అది రాజ్యాంగాన్ని రద్దు చేసేందుకు కారణమవుతుందని ఆయన చేసిన వ్యాఖ్యలు తమ పరువుకు, పార్టీకి నష్టం కలిగించేలా ఉన్నాయని అందుకే వెంటనే ఆయనపై చర్యలు తీసుకువాలని కోరారు.