23-06-2025 12:57:26 AM
చర్ల, జూన్ 22: తెలంగాణలోని చర్ల మండల సరిహద్దు రాష్ట్రమైన ఛత్తీస్గఢ్ రాష్ట్రం కొంటా బ్లాక్లోని కొంటా, గోలపల్లి, కిష్టారాం, చింతగుఫా, పోలంపల్లి, డోర్నపాల్, ఎర్రబోర్, బెజ్జి పోలీస్ స్టేషన్ల అంతర్భాగాలలో పనిచేస్తున్న ఫారెస్ట్ గార్డులు, పట్వారీలకు తీవ్రమైన హెచ్చరిక అంటూ మావోయిస్టు పార్టీ కుంట ఏరియా కమిటీ కార్యదర్శి దుల్లా పేరు మీదుగా ఆదివారం లేఖ విడుదల చేశారు.
ప్రజా వ్యతిరేక అటవీ రక్షకులు, పట్వారీల దోపిడీకి వ్యతిరేకంగా ప్రజా ఉద్యమాన్ని తీవ్రతరం చేయండని లేఖలో పిలుపునిచ్చారు. బ్రాహ్మణీయ హిందూత్వ ఫాసిస్ట్ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మావోయిస్టుల నిర్మూలనకూ యత్నిస్తున్నాయని పేర్కొన్నారు. అభివృద్ధి పేరుతో పోలీసు శిబిరాలు, పోలీస్ స్టేషన్లు తెరుస్తున్నాయని, మరోవైపు అటవీ రక్షకులు, పట్వారీలు లోతట్టు ప్రాంతాలలోని గ్రామాల్లోకి ప్రవేశించి, సామాన్య ప్రజల నుంచి డబ్బును దోచుకుంటున్నారని ఆరోపించారు.
అటవీ శాఖ అధికారులు గ్రామసభ అనుమతి లేకుండా వెదురు, అడవులను నరికి రవాణా చేయడం ప్రారంభించారని ఆరోపంచారు. గిరిజనుల నుంచి, స్థానికుల నుంచి లంచంగా డబ్బు, మద్యం, కోడి, మేక, పందిని డిమాండ్ చేస్తున్నారని లేఖలో పేర్కొన్నారు.
పైన పేర్కొన్న అన్ని రకాల దోపిడీ, అణచివేత నిరంకుశత్వాన్ని మావోయిస్ట్ కొంటా ఏరియా కమిటీ తీవ్రంగా ఖండిస్తుందని పేర్కొన్నారు. అటవీ గార్డులు, పట్వారీల దోపిడీకి వ్యతిరేకంగా సామూహిక ఉద్యమం, ప్రతిఘటనను తీవ్రతరం చేయాలని అణచివేతదారులకు విజ్ఞప్తి చేస్తూ లేఖలో పేర్కొన్నారు.