23-06-2025 01:26:58 AM
- 2026 మార్చి నాటికి మావోయిస్టు రహిత భారత్ చేసి తీరుతాం
- మావోయిస్టులకు లొంగిపోవడమే శరణ్యం
- కేంద్ర మంత్రి అమిత్షా
రాయ్పూర్, జూన్ 22: మావోయిస్టులకు లొంగిపోవడం తప్ప మరో ఆప్షన్ లేదని కేంద్రహోం మంత్రి అమిత్షా తెలిపారు. రెండు రోజుల పర్యటన కోసం ఛత్తీస్గఢ్కు వెళ్లిన షా.. రాయ్పూర్ అటల్నగర్లోని నేషనల్ ఫోరెన్సిక్ సైన్స్ యూనివర్సిటీ (ఎన్ఎఫ్ఎస్యూ), సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్లకు ఆదివారం శంకుస్థాపన చేశారు.
అనంతరం మంత్రి మాట్లాడుతూ.. ‘ప్రతి ఏడాది వర్షాకాల పరిస్థితులను అనుకూలంగా తీసుకుని మావోయిస్టులు విశ్రాంతి తీసుకునేవారు. ఈ సారి వర్షాకాలంలో కూడా వారిని నిద్రపోనివ్వం. 2026 మార్చి నాటికి మావోయిస్టు రహిత్ భారత్ లక్ష్యాన్ని సాధించే దిశగా మరింత ముందుకు వెళ్తున్నాం. మావోయిస్టులు లొంగిపోవాలి.
వారితో చర్చలు అవసరం లేదు. సాయుధ పోరాటాన్ని వదిలి జనజీవన స్రవంతిలో చేరేవారికి మరింత సాయం చేసేందుకు ప్రయత్నిస్తాం.’ అని పేర్కొన్నారు. నక్సలిజం సమస్యపై ఛత్తీస్గఢ్, ఏపీ, తెలంగాణ, మధ్యప్రదేశ్, జార్ఖండ్, ఒడిశా రాష్ట్రాల ఉన్నతాదికారులతో షా సమీక్ష నిర్వహించారు. యాంటీ నక్సల్స్ ఆపరేషన్స్ గురించి సమావేశంలో చర్చించారు. గత నెలలో బస్తర్ రేంజ్లో అగ్రశ్రేణి మావోయిస్టు లీడర్లను మట్టుబెట్టారు.