05-06-2025 12:00:00 AM
జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్
మెదక్, జూన్ 4(విజయక్రాంతి): రైతులు నష్టపోయే విధంగా నకిలీ విత్తనాలు, ఎరువులు పురుగు మందులు విక్రయిస్తే డీలర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ హెచ్చరించారు. బుధవారం చిన్నశంకరంపేట్ మండలం గవ్వలపల్లి ఎక్స్ రోడ్లోని తెలంగాణ ఆగ్రోస్ రైతు సేవా కేంద్రం జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఖరీఫ్ సీజన్ సాగు కోసం జిల్లాలో విత్తనాలు, ఎరువులు, పురుగు మందులకు కొరత లేదని స్పష్టం చేశారు. ప్రభుత్వ నిబంధనలు పాటించాలని స్పష్టం చేశారు.
ప్రతి డీలర్ లైసెన్స్ రెన్యువల్ చేసుకోవాలని, తమ దుకాణంలోని స్టాక్ వివరాలు బోర్డు పై ప్రదర్శించాలని, వాటి వివరాలు ఆన్లైన్ లో ఎంట్రీ చేయాలని సూచించారు. గడువు ముగిసిన ఎరువులు, విత్తనాలు, పురుగు మందులు అమ్మవద్దని పేర్కొన్నారు. ప్రతి అమ్మకానికి సంబంధించి రసీదు రైతులకు అందజేయాలని కలెక్టర్ తెలిపారు. రైతులు కూడా తప్పనిసరిగా బిల్లు తీసుకోవాలని సూచించారు.
రైతుల. నకిలీ విత్తనాలు ఎక్కడైనా విక్రయిస్తునట్టు సమాచారం ఉంటే సంబంధిత అధికారులకు తెలియజేయాలని కోరారు. పోలీసులు, వ్యవసాయ అధికారులు, దుకాణాల డీలర్లు కలిసి వీటిని అరికట్టాలని సూచించారు. నకిలీ విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
పచ్చిరొట్ట విత్తనాలు అవసరానికి అనుగుణంగా అందుబాటులో ఉంచుతున్నామన్నారు. రైతులు విత్తనాలు కొనేటప్పుడు తగు జాగ్రత్తలు పాటించాలని చెప్పారు. వ్యవసాయ, పోలీస్ సమన్వయంతో టాస్క్ ఫోర్స్ బృందాల ద్వారా నిరంతర తనిఖీలు నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు.