ఖర్గేను అవమానిస్తారా.. బీజేపీ వైఖరిపై టీపీసీసీ ప్రధాన కార్యదర్శి శ్రీను బాబు ఫైర్
సంగారెడ్డిలో కాంగ్రెస్ భారీ నిరసన ర్యాలీ.. బీజేపీ తీరుపై తీవ్ర ఆగ్రహం
మంథని, సంగారెడ్డి,(విజయ క్రాంతి): కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను అవమానించేలా బీజేపీ నేతలు వ్యవహరించడాన్ని నిరసిస్తూ సంగారెడ్డిలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ, ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీను బాబు పాల్గొని బీజేపీ వైఖరిపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కాంగ్రెస్ ఎస్సీ సెల్ సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు గంగేరి శ్రీహరి ఆధ్వర్యంలో జరిగిన నిరసన కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
సంగారెడ్డిలోని ఐబీ నుంచి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వరకు నిర్వహించిన ర్యాలీలో శ్రీను బాబు కార్యకర్తలతో కలిసి నడిచారు. 0ఉత్తరాఖండ్లో మల్లికార్జున ఖర్గే ప్రసంగించిన వేదికను మరుసటి రోజు ‘శుద్ధీకరణ’ పేరుతో గంగాజలంతో శుభ్రం చేయడం వంటి చర్యలు కుల, మత విద్వేషాలను రెచ్చగొట్టేలా ఉన్నాయని శ్రీను బాబు తీవ్రంగా ఖండించారు. దేశ ప్రజలందరినీ సమానంగా గౌరవించాల్సిన బాధ్యత రాజకీయ పార్టీలపై ఉంది.
ఇలాంటి వివక్షాపూరిత చర్యలను ప్రజాస్వామ్యవాదులు ఖండించాలని ఆయన అన్నారు. అనంతరం మహాత్మా జ్యోతిరావు ఫూలే, బాబూ జగ్జీవన్రామ్ విగ్రహాలకు శ్రీను బాబు, కాంగ్రెస్ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఏఐసీసీ పరిశీలకుడు దీపక్ రాథోర్, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, డీసీసీ అధ్యక్షురాలు నిర్మలా జగ్గారెడ్డి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ రియాజ్, నేరెళ్ల శారద తదితరులు పాల్గొన్నారు.






