01-08-2025 04:46:10 PM
హాజరు కానున్న వరంగల్ జిల్లా న్యాయవాదులు..
హన్మకొండ (విజయక్రాంతి): ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ(All India Congress Committee)కి చెందిన చట్ట, మానవ హక్కులు, ఆర్టీఐ విభాగం నిర్వహిస్తున్న వార్షిక లీగల్ కాన్క్లేవ్ 2025 ఢిల్లీలో జరిగే కార్యక్రమానికి వరంగల్, హనమకొండ కాంగ్రెస్ లీగల్ సెల్ సభ్యులు హాజరుకానున్నట్లు కాంగ్రెస్ లీగల్ సెల్ వరంగల్ కన్వీనర్ న్యాయవాది కొక్కొండ రమేష్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మహాసభ 2025 ఆగస్టు 2వ తేదీన న్యూఢిల్లీ లోని విజ్ఞాన్ భవన్లో జరగనుందని, ఈ సమావేశంలో “రాజ్యాంగ సవాళ్లు-దృక్కోణం మరియు పరిష్కార మార్గాలు” అనే అంశంపైన చర్చ జరుగుతుందని, ప్రస్తుతం భారత రాజ్యాంగం ఎదుర్కొంటున్న ప్రధాన సవాళ్లు, న్యాయ వ్యవస్థ స్థితిగతులు, ప్రజాస్వామ్య పరిరక్షణలో చట్ట వ్యవస్థ పాత్రపై దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ న్యాయ నిపుణులు, లీగల్ సెల్ నేతలు ఈ సమావేశంలో చర్చించనున్నారని తెలిపారు. అనంతరం సభ పోస్టర్ ను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ అనుబంధ లీగల్ సెల్ న్యాయవాదులు పాల్గొన్నారు.