08-01-2026 06:35:15 PM
హైదరాబాద్: ఎర్రవెల్లిలోని తన నివాసంలో బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ను పంచాయతీ రాజ్ & మహిళా, శిశు సంక్షేమ శాఖల మంత్రి సీతక్క, రాష్ట్ర దేవదాయ ధర్మదాయ, అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ మర్యాదపూర్వకంగా కలిశారు. మరికొద్ది రోజుల్లో మేడారం సమ్మక్క సారలమ్మ జాతర ప్రారంభం కానున్న సందర్భంగా జాతరను సందర్శించాలని కోరుతూ కేసీఆర్ ని ప్రభుత్వం తరఫున వారు ఆహ్వానించారు. ఈ సందర్భంగా శాలువా కప్పి ఆహ్వాన పత్రికను, మేడారం ప్రసాదం అందజేశారు. తన ఇంటికి వచ్చిన ఆడబిడ్డలను ఆత్మీయంగా పలకరించి సాదరంగా ఆహ్వానించిన కేసీఆర్ శోభమ్మ దంపతులు, వారిని పసుపు కుంకుమ వస్త్రాలు, తాంబులాలతో సాంప్రదాయ పద్ధతిలో సత్కరించారు.
కేసీఆర్ దంపతులు అందించిన తేనీటి విందు స్వీకరించిన మహిళా మంత్రులు, కాసేపు పరస్పర యోగక్షేమాలు, ఇష్టాగోష్టి అనంతరం మంత్రులు తిరుగు ప్రయాణం అయ్యారు. కాగా.. తొలుత, ఎర్రవెల్లి నివాసానికి చేరుకున్న మహిళా మంత్రులకు మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్, సాదర ఆహ్వానం పలికారు. అధికారిక ఆహ్వానం, సమ్మక్క-సారలమ్మల పవిత్రమైన పట్టువస్త్రాలను స్వయంగా సమర్పించేందుకు మేము ఆయన ఎర్రవెల్లి నివాసాన్ని సందర్శించామని ఈ సందర్భంగా కొండా సురేఖ తెలిపారు.
