6 June, 2026 | 6:58 PM

ఆలిండియా పోలీస్ స్పోర్ట్స్ మీట్‌లో బ్రాంజ్ మెడల్ సాధించిన కానిస్టేబుల్ శ్రీలత

06-06-2026 05:47 PM

రామగుండం సీపీ అంబర్ కిశోర్ ఝా చేతుల మీదుగా ఘన సత్కారం

గోదావరిఖని,(విజయక్రాంతి): జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరిచి రామగుండం పోలీస్ కమిషనరేట్‌కు కీర్తి తెచ్చిన మహిళా కానిస్టేబుల్ శ్రీలతను పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా ప్రత్యేకంగా అభినందించి, ఘనంగా సత్కరించారు. హర్యానా రాష్ట్రంలోని కర్నాల్‌లో గత నెల మే 23న నిర్వహించిన '3వ ఆలిండియా పోలీస్ స్పోర్ట్స్ మీట్'లో పెద్దపల్లి జోన్‌కు చెందిన మహిళా కానిస్టేబుల్ శ్రీలత పాల్గొన్నారు. యోగా విభాగంలో (35 నుండి 45 ఏళ్ల వయోపరిమితి) ఆమె అత్యుత్తమ ప్రదర్శన కనబర్చి 'బ్రాంజ్ మెడల్' (కాంస్య పతకం) సాధించారు.

ఈ విజయంతో కమిషనరేట్ స్థాయిని జాతీయ వేదికపై నిలబెట్టిన శ్రీలతను పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా స్వయంగా అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, క్రీడల్లో రాణించడం అభినందనీయమని, శ్రీలత స్ఫూర్తిని ఇతర సిబ్బంది కూడా అలవర్చుకోవాలని ఆకాంక్షించారు. భవిష్యత్తులో మరిన్ని ఉన్నత విజయాలు సాధించి శాఖకు మరింత పేరు తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమంలో గోదావరిఖని ఏసీపీ మడత రమేష్, కమాన్‌పూర్ ఎస్‌ఐ ప్రసాద్‌తో పాటు పలువురు పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.