18-06-2025 12:03:59 AM
మహబూబాబాద్, జూన్ 17 (విజయ క్రాంతి): మహబూబాబాద్ జిల్లాలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం జోరుగా సాగుతోంది. నియోజకవర్గానికి 3,500 చొప్పున ప్రభుత్వం ఇందిరమ్మ ఇం డ్లను మంజూరు చేయగా, ఎమ్మెల్యేలు జనాభా ప్రాతిపదికన గ్రామాలకు ఇండ్లను కేటాయించి, తొలి విడత ఇంటి స్థలం ఉండి ఇల్లు లేని నిరుపేదలను ఎంపిక చేసి అందులో, ప్రధమ ప్రాధాన్యం పూర్తిగా పేదలకు కల్పించి ప్రొసీడింగ్ కాపీలను అందజేసి, ఇంటి నిర్మాణాన్ని ప్రారంభిస్తున్నారు.
జిల్లా వ్యాప్తంగా దాదాపు అన్ని గ్రామాల్లో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం చేపట్టారు. మంగళవారం మదనాపురంలో ఎమ్మెల్యే డాక్టర్ భూక్యా మురళి నాయక్ ఇందిరమ్మ లబ్ధిదారులకు ఇండ్లు మంజూరు ప్రొసీడింగ్ పత్రాలను అందజేసి ఇంటి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఐదు దశల్లో ఇంటి నిర్మాణానికి తగ్గట్టుగా ఐదు లక్షల రూపాయలను ప్రభుత్వం అందజేస్తుందని చెప్పారు. ఇంటి నిర్మాణాన్ని జాప్యం చేయకుండా త్వరితగతిన పూర్తి చేసుకోవాలని కోరారు.