24-06-2025 12:50:02 AM
పటాన్ చెరు, జూన్ 23 :ఆటో కార్మికుల కోసం లింగంపల్లి చౌరస్తాలో శాశ్వత ఆటో స్టాండ్ నిర్మిస్తామని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. మియాపూర్ నుంచి పటాన్ చెరు వరకు గల ఆటో కార్మికుల కోసం లింగంపల్లి చౌరస్తాలో నూతనంగా నిర్మించిన ఫ్లైఓవర్ కింద పర్మినెంట్ ఆటో స్టాండ్ ఏర్పాటు చేసేందుకు నిర్ణయించినట్లు ఆయన తెలిపారు.
జాతీయ రహదారి 65 విస్తరణలో భాగంగా లింగంపల్లి చౌరస్తాలో నూతనంగా నిర్మించిన ఫ్లైఓవర్ మూలంగా స్థానికంగా ఆటో స్టాండ్ లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆటో డ్రైవర్లు ఇటీవల ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డికి తెలిపారు. ఉచిత బస్సు మూలంగా గిరాకీలు తగ్గడంతో పాటు ఆటో స్టాండ్ లేకపోవడంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వాపోయారు.
ఈ మేరకు సోమవారం సాయంత్రం పోలీసులు, జాతీయ రహదారుల సంస్థ అధికారులు, ఆటో యూనియన్ సంక్షేమ సంఘం నాయకులతో కలిసి ఆటో స్టాండ్ స్థలం కోసం ఎమ్మెల్యే బీహెచ్ఈఎల్ చౌరస్తాను పరిశీలించారు. ఎవరికి ఇబ్బందులు తలెత్తకుండా ఫ్లై ఓవర్ కింద మూడు పిల్లర్ల మధ్యన ఆటో స్టాండ్ కోసం స్థలం కేటాయించాలని జాతీయ రహదారుల సంస్థ డీఈ రామకృష్ణకు సూచించారు.
ఈ కార్యక్రమంలో నేషనల్ హైవేస్ డీఈ రామకృష్ణ, రామచంద్రాపురం మాజీ ఎంపీపీ యాదగిరి యాదవ్, ట్రాఫిక్ సీఐ విద్యాసాగర్ రెడ్డి, రామచంద్రాపురం సీఐ జగన్నాథ్, నగేష్ యాదవ్, ఆటో డ్రైవర్ల సంక్షేమ సంఘం రాష్ట్ర నాయకులు గూడెం మధుసూదన్ రెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షులు దస్తగిరి, ఆటో డ్రైవర్లు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.
ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలి...
పోచమ్మ తల్లి ఆశీస్సులతో ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. పటాన్ చెరు డివిజన్ పరిధి ముదిరాజ్ బస్తిలోని పోచమ్మ తల్లి దేవాలయం ఐదవ వార్షికోత్సవ కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డిని ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ యాదగిరి యాదవ్, సీనియర్ నాయకుడు వెంకటరెడ్డి, ఆలయ కమిటీ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.