calender_icon.png 24 June, 2025 | 7:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిఘా నేత్రాలపై నిర్లక్ష్యం!

24-06-2025 12:50:33 AM

-ప్రారంభంలోనే ఆర్భాటం

-ఆ తర్వాత పట్టింపు కరువు

-మూన్నాళ్ల ముచ్చటలా సీసీ కెమెరాల ఏర్పాటు

కామారెడ్డి, జూన్ 23,(విజయ క్రాంతి), నిఘా నేత్రాలపై కామారెడ్డి జిల్లాలో నీలి నీడలు అలుముకున్నాయి. కామారెడ్డి జిల్లాలో ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రామాలు, పట్టణాలలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని అప్పటి ఎస్పీలు, ప్రస్తుత ఎస్పి రాజేష్ చంద్ర జిల్లా పోలీసులతో జరిగిన ప్రతి సమావేశంలో సీసీ కెమెరాలు ప్రాధాన్యతపై వివరిస్తున్నారు.

స్థానికంగా ఉన్న ప్రజలకు కూడా సీసీ కెమెరాలు ఆవశ్యకత పై అవగాహన కల్పించాలని సూచిస్తున్నారు. అంతవరకు బాగానే ఉన్నా గత రెండు, మూడు సంవత్సరాలు క్రితం ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు పనిచేయడం లేదు. వాటిని రిపేర్ చేయించాల్సి ఉండగా స్థానిక పోలీస్ అధికారులు పట్టించుకోవడం లేదు. గ్రామంలోని గ్రామ కమిటీలు, గ్రామ పెద్దలు సీసీ కెమెరాలు మరమ్మత్తులు చేపట్టడం లేదు.

కామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రానికి కూతవేటు దూరంలో కోనాపూర్ గ్రామంలో సీసీ కెమెరాలు పనిచేయడం లేదు. మహాత్మా గాంధీ సాక్షిగా నిఘా నేత్రాలు నేలని చూస్తూ ఉండడం పై స్థానికులు విమర్శలు చేస్తున్నారు. 

మూడు జిల్లాల సరిహద్దు ప్రాంతమైన కోనాపూర్ లో సీసీ కెమెరాలు పనిచేయకుండా పట్టించుకోవడం లేదని గ్రామస్తులు వాపోతున్నారు. మూడు జిల్లాలకు చెందిన ప్రజలు ఈ గ్రామం నుంచి ప్రయాణం చేస్తుంటారు. కామారెడ్డి జిల్లా దోమకొండ మండల పోలీస్ స్టేషన్ పరిధిలోని కోనాపూర్ గ్రామం లో బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ తారక రామారావు దత్తత గ్రామంలో నిఘా నేత్రాలు నేలకొరగడంపై స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు,పోలీసులు తారతమ్యం చూపిస్తున్నారని గ్రామంలో అభివృద్ధి నోచు కోవడం లేదని పలువురు అభిప్రాయపడుతున్నారు.

రాజన్న సిరిసిల్ల జిల్లా, కామారెడ్డి జిల్లా ,సిద్దిపేట జిల్లాల సరిహద్దు ప్రాంతంగా ఉన్న కోనాపూర్ గ్రామంలో నిఘా వ్యవస్థ నిర్వీర్యం కావడంపై నిఘా నేత్రాలు నేలకొరకడంతో అక్రమ చొరబాటు దారులు, మత్తు పదార్థాలు, గంజాయి, ఆల్ఫోజొలo లాంటి మత్తు పదార్థాల సరఫరాకు, అక్రమ ఇసుక రవాణాకు కేంద్ర బిందువుగా మారినట్లు స్థానికులు చెప్తున్నారు. అధికారులు పోలీసుల అండదండలతో సాగుతున్నాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చూసి చూడనట్లు వదిలేస్తున్న అధికారుల  తీరుపై ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

నెల కాగానే అక్రమ రవాణా, చేసే వారి వద్ద నుండి మామూలు వస్తే సరి అనుకున్న అధికారుల తీరు మారాలని ప్రజల క్షేమం కోసం కామారెడ్డి జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర ఆదేశానుసారం ప్రతి గ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ప్రోత్సహిస్తూ ఒక కెమెరా 100 మందికి సమానమని అవగాహన కల్పిస్తున్న పోలీస్ అధికార గణం మూడు జిల్లాల సరిహద్దు ప్రాంతమైన కోణాపూర్ లో నిఘా నేత్రాలు నేలకొరిగిన పట్టించుకోకపోవడంపై పోలీసు వ్యవస్థ పనితీరు అధికారుల నిర్లక్ష్య ధోరణి స్పష్టంగా కనిపిస్తుందని గ్రామస్తులు తెలిపారు.  అక్రమ గంజాయి రవాణా, మత్తు పదార్థాలు, ఇసుక అక్రమ రవాణాను అడ్డుకోవాలని అన్ని శాఖల అధికారులు ప్రతి దినం అవగాహన కల్పిస్తున్నప్పటికిని కొందరి అధికారుల పనితీరు వలన ఆ  శాఖ కు మచ్చ తెస్తున్నారు.

అధికారుల వరకు చెడ్డ పేరు రావడం  పట్ల ప్రజల్లో అధికారులపై నమ్మకం కోల్పోతున్నట్లు ప్రజలు అనుకుంటున్నారు. అధికారుల తీరు మార్చుకొని మామూళ్ల మత్తులో జోగకుండా నిఘా వ్యవస్థను పటిష్టం చేసే దిశగా సీసీ కెమెరాలు పునరుద్ధరణకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. అక్రమ రవాణాను అక్రమ గంజాయి రవాణాను అరికట్టే క్రమంలో ఈ సీసీ కెమెరాలు నేలకొరిగాయని పలువురు భావిస్తున్నారు. జిల్లాలో ని కామారెడ్డి, బాన్సువాడ, ఎల్లారెడ్డి పోలీస్ సభ్యులు పరిధిలోనిప్రతి గ్రామంలో సీసీ కెమెరాలు ఉన్నప్పటికిని ప్రముఖ కూడలిలలో చౌరస్తాలలో కెమెరాలు నేలకొరకడం గానీ పని చేయకపోవడంపై అక్రమార్కుల పై నిఘా ఏ విధంగా ఉంటుందో నని గ్రామస్తులు భావిస్తున్నారు.

అధికారులు మాత్రం చూచి చూడనట్లు అక్రమార్కులకు అండగా అక్రమ రవాణాకు తమ వంతు సహాయంగా సీసీ కెమెరాలను పట్టించుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి.ఇప్పటికైనా అధికారులు స్పందించి గ్రామాలలో, పట్టణాల్లో సీసీ కెమెరాలు పనిచేయని వాటిని తీసి మరమ్మతులు చేపట్టాలని కోరుతున్నారు. ఎంత అవగాహన కల్పించిన ఆచరణలో ఉంటేనే సత్ఫలితాలు వస్తాయని పలువురు భావిస్తున్నారు.

సీసీ కెమెరాలకు మరమ్మతులు చేయిస్తాం

కామారెడ్డి జిల్లాలో ప్రతి గ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటు కోసం కృషి చేస్తు న్నాం. ఎక్కడైనా సీసీ కెమెరాలు పనిచేయకుండా ఉంటే స్థానిక సమాచారం అందించాలి. స్థానికంగా ఉన్న అధికారులు స్పందించకుంటే జిల్లా అధికారుల దృష్టికి తీసుకురావాలి. నిఘా కోసమే సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నాం. ఎవరు నిర్లక్ష్యం వహించిన వారిపై చర్యలు తీసుకుంటాం.

 ఎస్పీ రాజేష్ చంద్ర